KOHLI: బీసీసీఐపై కోహ్లీ అసంతృప్తి..!

విదేశీ పర్యటనల్లో భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులు ఉండటంపై బీసీసీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో బీసీసీఐ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. ఇటీవల బీసీసీఐ నిర్ణయంపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన బీసీసీఐ కుటుంబసభ్యులతో ఉండాలనుకునే ఆటగాళ్లు అనుమతి తీసుకోవాలని చెప్పింది. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సింది. విదేశీ పర్యటనలలో కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో గడపడానికి బీసీసీఐ 10 సూత్రాల మార్గదర్శకాన్ని విధించింది. ఇది కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో గడపడానికి నిర్దేశించిన సమయాన్ని పరిమితం చేసింది. 45 రోజుల కంటే తక్కువ నిడివి ఉండే టూర్లలో అయితే కుటుంబ సభ్యులకు వారం రోజులే అనుమతి ఉంటుంది. 45 రోజుల కంటే ఎక్కువ నిడివి ఉండే టూర్లలో 14 రోజుల వరకే కుటుంబ సభ్యులకు అనుమతి ఉంటుంది. కోహ్లీ ఈ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ముఖ్యంగా విదేశీ పర్యటనలలో ఆటగాళ్లకు తమ ప్రియమైనవారు దగ్గరగా ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నాడు. దీనిపై బీసీసీఐ స్పందించింది.
కోహ్లీ వ్యాఖ్యలకు కపిల్దేవ్ మద్దతు
బీసీసీఐ ఫ్యామిలీ రూల్ విషయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు కపిల్దేవ్ మద్దతు ఇచ్చారు. ఆటగాళ్లకు వారి జట్టుతో పాటు కుటుంబం కూడా అవసరమే అని కపిల్ దేవ్ అన్నారు. తమ కాలంలో పర్యటనల్లో క్రికెట్, కుటుంబానికి సమాన ప్రాధాన్యం ఇచ్చేవారమని గుర్తు చేసుకున్నారు. 'మా కాలంలో మేం మొదట జట్టుగా ఆడేవాళ్లం, తర్వాత నెమ్మదిగా మా కుటుంబాలు వచ్చేవి' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
దుబాయ్ లో ఇలా...
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్ళు తమ కుటుంబాలతో దుబాయ్లో ఉన్నప్పటికీ, జట్టుతో కలిసి హోటల్లో బస చేయలేదు. వారి బసకు సంబంధించిన ఖర్చులను బోర్డు భరించలేదు, ఆటగాళ్లే సొంతంగా చెల్లించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com