T20 WORLD CUP: టీమిండియా "వైభవో"పేతం

భారత క్రికెట్ భవిష్యత్తు మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని, సంకల్పానికి హద్దులు ఉండవని నిరూపిస్తూ భారత అండర్–19 జట్టు మరో చరిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒత్తిడి క్షణాల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, జట్టు ఆటతో ముందుకు సాగిన యువ భారత్… ఆరోసారి అండర్–19 ప్రపంచకప్ను కైవసం చేసుకుని దేశాన్ని గర్వంతో నింపింది. ఇది కేవలం ఒక ట్రోఫీ కాదు… భారత క్రికెట్కు కొనసాగుతున్న విజయ పరంపరకు మరో బలమైన ముద్ర. ఫైనల్ పోరులో ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేశాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. అతని బ్యాటింగ్లో ధైర్యం, టెక్నిక్, దూకుడు అన్నీ అద్భుతంగా కనిపించాయి. ఈ ఇన్నింగ్స్ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది.
ఆయుష్ మత్రే నాయకత్వంలో భారత యువజట్టు అద్భుతంగా రాణించింది. వరుసగా ఆరోసారి ఫైనల్ చేరడమే కాకుండా, టైటిల్ను కూడా గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారత్ 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాల్లో టైటిల్ గెలవగా… ఇప్పుడు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇదే ఇంగ్లండ్పై భారత్కు మరో ప్రత్యేక విజయం. 2022లో ఇంగ్లండ్ను ఓడించి కప్ సాధించిన యువ భారత్, ఇప్పుడు మళ్లీ అదే జట్టుపై విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇక ఇంగ్లండ్కు ఇది మూడో ఫైనల్ ఓటమి. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన 15 అండర్–19 ప్రపంచకప్లలో భారత్ తొమ్మిది సార్లు ఫైనల్కు చేరగా, ఆరుసార్లు విజేతగా నిలిచింది. గతంలో మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, యష్ ధుల్ నాయకత్వంలో ట్రోఫీలు అందుకున్న భారత్… ఇప్పుడు ఆయుష్ మత్రే సారథ్యంలో మరోసారి కప్ను అందుకుంది.
ఈ విజయం యువతకు స్ఫూర్తి. భారత క్రికెట్కు భవిష్యత్తు ఎంత భద్రమో చెప్పే గొప్ప సంకేతం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
