ASES: యాషెస్ సిరీస్లో డీఆర్ఎస్ వివాదం

యాషెస్ సిరీస్ మూడో టెస్టులో తొలి రోజు చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనపై ఎట్టకేలకు ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆరఎస్) విషయంలో సాంకేతిక లోపం జరిగిందని అంగీకరించిన ఐసీసీ, ఇంగ్లండ్ జట్టు కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చినట్లు ప్రకటించింది.క్యారీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బ్యాట్ను స్వల్పంగా తాకినట్టు మైదానంలో స్పష్టంగా కనిపించినా, స్నికో మీటర్లో స్పైక్ నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్ వేసిన రివ్యూ విఫలమైంది. అప్పటికి క్యారీ 72 పరుగులతో ఉన్నాడు. ఆ నిర్ణయం తర్వాత అతడు శతకం పూర్తి చేయడంతో, ఆ నిర్ణయం ఇంగ్లండ్కు భారీ నష్టంగా మారింది. ఈ ఘటనపై ఇంగ్లండ్ క్యాంప్ నుంచి వెంటనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆసీస్ మరోసారి చీటింగ్ చేసిందంటూ కామెంట్స్ కూడా ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట ముగిసిన తర్వాత విడుదల చేసిన ప్రకటనలో, ప్రసార భాగస్వామి బీబీజీ స్పోర్ట్తో సంప్రదింపుల అనంతరం ఇంగ్లండ్కు రివ్యూను తిరిగి ఇచ్చినట్టు ఐసీసీ వెల్లడించింది. స్నికో మీటర్ ఆడియో క్యాలిబ్రేషన్లో లోపం ఉందని బీబీజీ స్పోర్ట్ కూడా అంగీకరించింది.క్యారీ కూడా మైదానంలో ఉన్నప్పుడే నిక్ ఉన్నట్టుగా అంపైర్లకు సంకేతాలిచ్చినట్టు కనిపించాడు. స్టంప్స్ అనంతరం మాట్లాడిన అతడు, టెక్నాలజీని నేరుగా విమర్శించకపోయినా, ఆ సమయంలో గందరగోళం నెలకొందని అంగీకరించాడు. “బంతి వెళ్లేటప్పుడు ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ క్షణంలో ప్రాసెస్ను నమ్మాల్సిందే. కానీ స్క్రీన్ చూపించిన దానికంటే మైదానంలో ఉన్న ఆటగాళ్లకు విషయం స్పష్టంగా అర్థమైంది” అని క్యారీ అన్నాడు.
ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్ డేవిడ్ సేకర్ మాత్రం స్నికో విశ్వసనీయతపై ఆందోళన వ్యక్తం చేశాడు. “ఈ సిరీస్ మొత్తం స్నికో క్యాలిబ్రేషన్ సరిగ్గా లేదన్న భావన ఉంది. ఆ సమయంలో అది చాలా కీలక నిర్ణయం. ఇలాంటి తప్పులు బాధిస్తాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంత బేసిక్ విషయాలను గుర్తించలేకపోవడం ఆశ్చర్యంగా ఉంది” అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటనను ఐసీసీ వద్ద అధికారికంగా లేవనెత్తాలని ఇంగ్లండ్ అధికారులు ఆలోచించినట్టు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, టెక్నాలజీ ప్రొవైడర్లతో కలిసి విధానాలను మరింత కఠినంగా సమీక్షిస్తామని ఐసీసీ తెలిపింది. రివ్యూను తిరిగి ఇచ్చినా, అప్పటికే ఇంగ్లండ్కు జరగాల్సిన నష్టం జరిగింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అడిలైడ్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. 326/8 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 91.2 ఓవర్లలో 371 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మిచెల్స్టార్క్ (54; 75 బంతుల్లో, 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. మొదటిరోజు అలెక్స్ కేరీ సెంచరీ (106; 143 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ (82, 126 బంతుల్లో, 10 ఫోర్లు) సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 5, బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు, జోష్ టంగ్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. బెన్స్టోక్స్ (45*; 151 బంతుల్లో, 3 ఫోర్లు), జోఫ్రా ఆర్చర్ (30*; 48 బంతుల్లో, 4 ఫోర్లు) ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

