BCCI: బెంగళూరు తొక్కిసలాటపై బీసీసీఐ ఫైర్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనోలో 11 మంది మరణించడంపై బీసీసీఐ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేడుకల నిర్వహణకు మార్గదర్శకాల జారీకి ఆలోచన చేస్తోంది. ఈమేరకు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు చూసి కూడా తాము మౌనంగా చూస్తు ఉండలేమని.. ఏదో ఒకటి చేయాలని సైకియా అన్నారు. ఇది ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేటు వ్యవహారమని... కానీ ఈ దేశంలో క్రికెట్ వ్యవహరాలకు తాము బాధ్యత తీసుకోవాల్సిందే అని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నామని సైకియా వ్యాఖ్యానించారు.
ఇప్పటికే స్పందించిన హెడ్ కోచ్ గంభీర్
బెంగళూరు తొక్కిసలాట ఘటనోలో 11 మంది మరణించిన ఘటనపై టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే స్పందించాడు. ‘‘నేను ఆడేటప్పుడైనా.. ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా సరే.. విజయోత్సవ ర్యాలీలను సమర్థించను. ఇలాంటివి ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి. గెలవడం ముఖ్యం.. వేడుకలు కాదు. అన్నింటికంటే వ్యక్తులు జీవితాలు ముఖ్యం. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా లేకపోతే.. ఈ రోడ్షోలు నిర్వహించకపోవడమే మంచిది’’ అని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటికే పలువురు అరెస్ట్
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడిన విషాదంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ను బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద్ను సస్పెండ్ చేయగా.. సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపైనా బదిలీ/సస్పెన్షన్ వేటు పడింది.ఇక, ఈ ఘటనకు సంబంధించిన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెతో పాటు డీఎన్ఏ మేనేజ్మెంట్ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్.. కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ తరఫున సంతాపం
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీసీసీఐ తరఫున ఆయన సంతాపం తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు, సురక్షితమైన భద్రత చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. అయితే పలు సందర్భాల్లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు. దీంతో ఐపీఎల్ గెలిచిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ ముగింపు.. అందుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పారు. ఈ విజయోత్సవ ర్యాలీని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన ఈ తొక్కిసలాటతో అభిమానులు తీవ్ర షాక్ కు గురయ్యారు. క్రీడోత్సవాల్లో ఇలాంటి తొక్కిసలాట జరగడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com