BUMRAH: మన బుమ్రాస్త్రాన్ని కాపాడుకునే వ్యూహాలు

భారత క్రికెట్ జట్టుకు కీలక బలంగా నిలిచిన వేగబౌలర్ జస్ప్రీత్ బుమ్రా భవిష్యత్ ప్రణాళికలపై ఇప్పుడు జట్టు యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రపంచ స్థాయి బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా, ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక సందర్భాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టడంలో అతడు చూపిన ప్రదర్శన జట్టుకు ఎంతో ఉపయోగపడింది. ఇక ముందు జరిగే ప్రధాన అంతర్జాతీయ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని బుమ్రా పనిభారం నియంత్రణపై భారత జట్టు మేనేజ్మెంట్ వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది. 2027 అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నారు. ఆ టోర్నీలో భారత్ విజయావకాశాలు మెరుగుపరచడంలో బుమ్రా పాత్ర ఎంతో కీలకం కావచ్చు. అందువల్ల అతడిని అనవసరంగా ఎక్కువ మ్యాచ్లలో ఆడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అతడి మ్యాచ్ల సంఖ్యను తగ్గించి వన్డే క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సుమారు 18 నెలల కాలంలో బుమ్రా ఎక్కువగా వన్డే మ్యాచ్లలోనే పాల్గొనేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో ఆటగాళ్లపై పనిభారం పెరుగుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు గాయాల ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
గతంలో బుమ్రా కూడా గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమయ్యాడు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అతడి పనిభారాన్ని సమతుల్యం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కీలక టోర్నీలకు ముందు అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండటం అత్యంత ముఖ్యమని జట్టు మేనేజ్మెంట్ అభిప్రాయపడుతోంది.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తరువాత టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్కు సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయనుంది. ఐపీఎల్ అనంతరం జాతీయ సెలక్షన్ కమిటీ, నేషనల్ క్రికెట్ అకాడమీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, అలాగే జట్టు మేనేజ్మెంట్ కలిసి బుమ్రా పనిభార నిర్వహణపై ప్రత్యేక బ్లూప్రింట్ రూపొందించనున్నట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. అయితే టెస్టు క్రికెట్ విషయంలో మాత్రం బుమ్రా రాజీ పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పోటీలలో అతడు భారత్కు ప్రధాన బౌలింగ్ అస్త్రంగా నిలుస్తున్నాడు. అందువల్ల టెస్టు మ్యాచ్లలో అతడి భాగస్వామ్యం కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి. గత రెండేళ్లుగా అతడి పనిభారాన్ని ఎలా నిర్వహించారో దాదాపు అదే విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్లను చాలా ఎంపిక చేసుకుని మాత్రమే ఆడినట్లు కనిపిస్తుంది. 2023 నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తరువాత అతడు కొంతకాలం వన్డే క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కు ముందు వరకు బుమ్రా మొత్తం 42 మ్యాచ్లలో మాత్రమే ఆడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
