RCB: తొక్కిసలాటలో సంచలన విషయాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ను సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా... దాదాపు 50మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసింది. జూన్ 4న, డీసీపీ... కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. “ఆర్సీబీకి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. లక్షలాది మంది వేడుకకు రావొచ్చు. భద్రతా సిబ్బంది కొరత ఉంది. అభిమానుల భారీగా తరలి వస్తే అనుకోని ఘటనలు జరగవచ్చు. ప్రజా ప్రవేశ పాస్లను రద్దు చేయాలి. విధానసౌధ ప్రాంగణంలో సీసీటీవీ నిఘా అసంపూర్ణంగా ఉంది. దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చు.” అని ముందుగానే పరిపాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి జి. సత్యవతికి రాసిన లేఖలో హెచ్చరించారు.
లేఖలో సంచలన విషయాలు
పీడబ్ల్యుడీ రెండు గంటల ముందుగానే వేదికను తనిఖీ చేసి, ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి అని డీసీపీ పేర్కొన్నారు. విద్యుత్ పరికరాలకు ప్రత్యేక ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి కూడా ప్రస్తావించారు. ట్రాఫిక్, శాంతిభద్రతల మధ్య సమన్వయం లోపాన్ని డీసీపీ లేఖలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పిలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డీసీపీ లేఖ రాసినప్పటికీ.. ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. ఫలితంగా, బెంగళూరు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజీనామాలు
మరోవైపు, చిన్నస్వామి మైదానం వెలుపల తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనకు నైతిక బాధ్యత వహించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఏమీ లేకపోయినా, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నామని కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
‘వాళ్లు ఆహ్వానిస్తేనే అక్కడికి వెళ్లా: సిద్ధరామయ్య
విజయోత్సవ ర్యాలీలో 11 మంది మరణించడంపై మరోసారి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ‘‘కేఎస్సీఏ కార్యదర్శి, కోశాధికారి నా వద్దకు వచ్చి ఆర్సీబీ ఈవెంట్కు ఆహ్వానించారు. ఈ వేడుకను మేం నిర్వహించలేదు.. కేఎస్సీఏ మాత్రమే ఏర్పాటు చేసింది. గవర్నర్ సైతం వస్తున్నారని నాతో వారు చెప్పారు. నన్ను ఆహ్వానించిన తర్వాతే నేనక్కడికి వెళ్లాను. వాళ్ల ఆహ్వానం మేరకు వెళ్లడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అసలు స్టేడియం వద్దకు నన్ను ఆహ్వానించలేదు’’ అని సీఎం అన్నారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కర్ణాటక విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటపలువురు నేతలు పాల్గొన్నారు. వీఐపీల రాకతో 5వేల మంది పోలీసు బలగాలు చీలడంతో ఆ తర్వాత కొద్దిసేపటికే స్టేడియం వద్ద తొక్కిసలాటకు దారి తీసిందని భాజపా పేర్కొంటోంది. ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా భారీ స్థాయిలో జనం రావడం, పోలీసులు అదుపు చేయలేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నగర పోలీస్ కమిషనర్తో పాటు పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com