IPL: ధోనీ రిటైర్మెంట్ రచ్చ

మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడన్న పోస్టులతో సోషల్ మీడియా దద్దరిల్లింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఈ మ్యాచ్లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్తో ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్ చూసేందుకు ధోనీ తల్లిదండ్రులు హాజరవడంతో జనాల్లో ఒక్కసారిగా మాహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై చర్చ మొదలైంది. 2008 నుంచీ చెన్నై తరుపున ధోనీ ఆడుతున్నా అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు రావడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులతో పాటు అతడి భార్య సాక్షి, కూతురు జివా కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చారు. భార్యాకూతురు రావడం అభిమానులకు కొత్త కాకపోయినా ధోనీ తల్లిదండ్రులను చూసేసరికి అనేక మంది ఆశ్చర్యపోయారు. ధోనీ ఈసారి రిటైర్ అవడం పక్కా అని తీర్మానించుకున్నారు.
అబ్బే అదేం లేదు..
ధోనీ రిటైర్మెంట్పై చర్చ పతాకస్థాయికి చేరడంతో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ధోనీ రిటైర్ కావట్లేదని స్పష్టం చేశాడు. ‘ఇప్పటికీ ధోనీ అద్భుతంగా ఆడుతున్నాడు. అసలు మేము ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడటమే మానేశాము’’ అని పేర్కొన్నాడు. నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగింది. చెన్నైలో స్వంత స్టేడియం కూడా తన రాతను మార్చలేకపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిపోయిన సీఎస్కే తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా ఓటమి పాలై హ్యాట్రిక్ అపజయాలను మూటగట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com