FIFA World Cup : నేడే ఫిఫా మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌

FIFA World Cup : నేడే ఫిఫా మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌
తుదిపోరుకు ఇంగ్లాండ్, స్పెయిన్... ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ... స్వీడన్‌ చేతిలో ఆస్ట్రేలియాకు తప్పని భంగపాటు

ఫిఫా మ‌హిళ‌ల ప్రపంచకప్‌లో పతకం సాధించాలన్న ఆస్ట్రేలియా(Australia) కల నెరవేరలేదు. కాంస్య పతక(Bronze Medal) పోరులో స్వీడన్‌ చేతిలో ఆస్ట్రేలియాకు మరోసారి భంగపాటు తప్పలేదు. ప్రపంచ క‌ప్‌లో తొలిసారి సెమీ ఫైన‌ల్ చేరిన ఆసిస్‌ను 2-0 తేడాతో స్వీడన్‌( australia vs swedan) మట్టికరిపించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా నాలుగో స్థానంతో స‌రిపెట్టుకుంది. మూడో స్థానంలో నిలిచిన‌ స్వీడ‌న్‌కు ఇది నాలుగోసారి కాంస్య పతాకాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైన‌ల్లో 3-1తో ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్న ఆసీస్.. వ‌రుస‌గా రెండో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది.


బ్రిస్బేన్‌లోని లాంగ్ పార్క్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో స్వీడ‌న్‌కు 28వ నిమిషంలో ఫ్రిడోలినా రాల్ఫో(Fridolina Rolfo) తొలి గోల్ అందించింది. ఆ త‌ర్వాత కెప్టెన్ కొసొవ‌రె అస్లానీ(Kosovare Asllani) 60వ నిమిషంలో గోల్ కొట్టి ఆధిక్యాన్ని రెండుకు పెంచింది. స్కోరును సమం చేసేందుకు ఆస్ట్రేలియా ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వీడన్‌ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. మ‌రో సెమీస్ పోరులో స్పెయిన్ 2-1తో స్వీడ‌న్‌ను ఓడించి ఫైన‌ల్ చేరింది. నేడు స్పెయిన్, ఇంగ్లాండ్ జ‌ట్లు టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్నాయి.

నెలపాటు ప్రపంచకప్‍లో హోరాహోరీ మ్యాచ్‍లు జరగగా.. ఇంగ్లాండ్, స్పెయిన్(Spain vs England ) తుదిపోరుకు వచ్చాయి. ఫుట్‍బాల్ మహిళల ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్‍కు చేరడం ఇంగ్లండ్, స్పెయిన్‍కు ఇదే తొలిసారి. ఏ జట్టు గెలిచినా మొదటిసారి టైటిల్ దక్కించుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఫుట్‍బాల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్, స్వీడెన్‍పై స్పెయిన్ గెలిచి తుదిపోరుకు వచ్చాయి.


మొదటిసారిగా ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు రెండూ సంయుక్తంగా నిర్వహించాయి. టోర్నమెంట్ చరిత్రలో ఇది 9వ ఎడిషన్. తొలిసారిగా రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. ఇందులో మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, నార్వే మధ్య జరిగింది. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా 32 జట్లు ఈసారి ప్రపంచకప్‌లో పాల్గొన్నాయి. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023లో 9 స్టేడియంలలో మొత్తం 64 మ్యాచ్‌లు జరగగా నేడు ఫైనల్‌ జరగనుంది.

ఈసారి మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టుకు గతసారి కంటే 3 రెట్లు ఎక్కువ ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ.86 కోట్లు అందుతాయి. అదే సమయంలో, 2019 సంవత్సరంలో, టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ $ 30 మిలియన్లు, ఇది ఈసారి $ 110 మిలియన్లకు దగ్గరగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story