ICC: బీసీసీఐ ఆశలపై ఐసీసీ నీళ్లు

ICC: బీసీసీఐ ఆశలపై ఐసీసీ నీళ్లు
X
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిర్వహణకు నో

భారతీయ క్రికెట్ నియంత్రణ బోర్డుకు (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ని నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది. కానీ, భారత్‌ ఆశలకు ఐసీసీ బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే మూడు సీజన్లలోనూ డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లాండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇంగ్లాండ్‌లోనే ఫైనల్

2021లో ప్రారంభమైన డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్స్‌ను ఇంగ్లాండ్‌లోనే నిర్వహిస్తున్నారు. 2023-25 సైకిల్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ లార్డ్స్‌ వేదికగా జరుగుతోంది. తాజా సీజన్‌తో కలిపి ఇప్పటివరకు మూడు ఎడిషన్ల ఫైనల్‌ మ్యాచ్‌లను సౌతాంప్టన్‌, ఓవల్‌, లార్డ్స్‌ వేదికలుగా నిర్వహించారు. అయితే, భారత్‌లోనూ ఈ ఫార్మాట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశం కల్పించాలని బీసీసీఐ తమ ఆసక్తిని వ్యక్తం చేసింది. అయితే, ఐసీసీ మాత్రం ఇందుకు సుముఖత చూపలేదని సమాచారం.

ఆల్‌టైమ్ టెస్ట్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 21వ శతాబ్దపు ఆల్‌టైమ్ టెస్ట్ ఎలెవెన్‌ను ప్రకటించారు. విలియమ్సన్ ఆల్‌టైమ్ ఎలెవన్: మాథ్యూ హెడెన్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్(కెప్టెన్), సచిన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, ఎం‌ఎస్ ధోనీ(కీపర్), డేల్ స్టెయిన్, షోయబ్ అక్తర్, గ్లేన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్. ఇందులో కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. సెహ్వాగ్‌తో పాటు మాథ్యూ హెడెన్‌లను ఓపెనర్లుగా పేర్కొన్న కేన్ మామ.. రికీ పాంటి, సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్‌లను మిడిలార్డర్ బ్యాటర్లుగా ఎంపిక చేశాడు.

Tags

Next Story