క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్ .. ఒలింపిక్స్లో క్రికెట్..!
క్రికెట్ అభిమానులు గున్ న్యూస్.. ఒలింపిక్స్లో ఇకపై అన్ని ఆటలతో పాటు క్రికెట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విశ్వ క్రీడల్లో అన్ని రకాల ఈవెంట్లు ఉన్నా.. క్రికెట్ లేకపోవడంపై చాలా మంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒలింపిక్స్ వచ్చిన ప్రతీసారి క్రికెట్ను చేర్చాలనే డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ విధంగా ఇంత వరకు ప్రయత్నాలు మాత్రం జరగలేదు. ఎన్నో క్రీడలు ప్రమాదకరమైనవిగా చెబుతూ ఒలింపిక్స్ ఈవెంట్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రమాదం లేని క్రికెట్ను మాత్రం చేర్చడం లేదు.
ఒలింపిక్స్ చరిత్రలో కేవలం 1900 ప్యారీస్ ఒలింపిక్స్లో మాత్రమే క్రికెట్ ఒక ఈవెంట్గా నిర్వహించారు. కేవలం ఒకే ఒక మ్యాచ్ నిర్వహించగా అందులో గ్రేట్ బ్రిటన్ గెలుపొందింది. ఆ తర్వాత క్రికెట్ ఊసే ఎత్తలేదు. అప్పట్లో క్రికెట్ ఆరు రోజుల పాటు నిర్వహించే ఫార్మాట్లో ఉండటంతో దానికి ఒలింపిక్స్లో స్థానం లేకుండా పోయింది. అయితే వన్డే క్రికెట్ వచ్చిన తర్వాత మరోసారి క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న టీ20 ఫార్మాట్లో ఒలింపిక్స్ ఈవెంట్గా నిర్వహించాలని భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఐసీసీ ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో కలసి ఐసీసీ ఈ విషయంపై చర్చలు జరిపింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తో కూడా ఐసీసీ చర్చించింది.
ఐసీసీ, బీసీసీఐ కలసి క్రికెట్ను ఒలింపిక్స్లో ఒక మెడల్ ఈవెంట్గా చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. 2024లో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనుండగా.. 2028లో లాస్ ఏంజెల్స్లో విశ్వక్రీడలు జరగనున్నాయి. అలానే 2032లో బ్రిస్బేన్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో.. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ని లక్ష్యంగా చేసుకుని ఐసీసీ బిడ్ వేయబోతోంది. దాంతో యూఎస్ఏ నుంచి పూర్తి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అన్నీ అనుకూలంగా జరిగితే 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ఒలింపిక్ ఈవెంట్గా చేర్చడం ఖాయంగానే కనిపిస్తున్నది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com