CWC2023: మనల్ని ఎవడ్రా ఆపేది

ప్రపంచకప్లో టీమిండియా అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయంతో మహా సంగ్రామంలో నాకౌట్లో దాదాపుగా అడుగుపెట్టింది. లో స్కోరింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను రోహిత్ సేన మట్టికరిపించింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను భారత్ బౌలర్లు వణికించారు. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్ జట్టు కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్.. ప్రపంచకప్ సెమీఫైనల్కు కూడా దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ గెలిచిన అయిదు మ్యాచుల్లోనూ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా... తొలిసారి బ్యాటింగ్కు దిగింది. రోహిత్ శర్మ తొలి ఓవర్ను మెయిడెన్ ఆడాడు. కానీ తర్వాత గిల్, రోహిత్ మంచి టచ్లో కనిపించాడు. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్గా తన వందో మ్యాచ్లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో కె. ఎల్. రాహుల్ అవుటవ్వడం టీమిండియాను దెబ్బ తీసింది. 58 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన రాహుల్ విల్లీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు. దీంతో రాహుల్- రోహిత్ మధ్య నమోదైన 91 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ను అదిల్ రషీద్ అవుట్ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
రోహిత్ శర్మ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. పిచ్ను అర్థం చేసుకుని తనశైలికి విరుద్ధంగా స్కై బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 49 పరుగుల వద్ద సూర్య అవుటయ్యాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు, క్రిస్ వోక్స్ 2, అదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను టీమిండియా బౌలర్లు వణికించారు. నాలుగో ఓవర్లో డేవిడ్ మలన్, జో రూట్ను వరుస బంతుల్లో పెవిలియన్కు చేర్చిన బుమ్రా ఇంగ్లండ్ పతనాన్ని సాధించాడు. ఇక ఏ దశలోనూ బ్రిటీష్ జట్టు కోలుకోలేదు. షమీ రంగంలోకి దిగిన తర్వాత ఇంగ్లండ్ కష్టాలు మరింత పెరిగాయి. బెన్ స్టోక్స్ను అద్భుత బంతితో బౌల్డ్ చేసిన షమీ... తర్వాతి ఓవర్ తొలి బంతికే బెయిర్ స్టోను కూడా అవుట్ చేసి హ్యాట్రిక్ ముందు నిలిచాడు. బ్రిటీష్ ఏడుగురు బ్యాటర్లు కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. చివరికి ఇంగ్లండ్ కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com