IND-AUS: నేడే భారత్‌-ఆసిస్‌ చివరి వన్డే

IND-AUS: నేడే భారత్‌-ఆసిస్‌ చివరి వన్డే
బరిలోకి రోహిత్‌శర్మ, కోహ్లీ... ఆసీస్‌ను తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేయాలన్న లక్ష్యంతో టీమిండియా

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్‌లో చివరి వన్డే జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు ఇరుజట్లకిదే చివరి సన్నాహక మ్యాచ్‌. అయితే పేరుకిది నామమాత్రమే అయినా ఈ వన్డే కోసం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ జట్టులో చేరారు. ఈ మ్యాచ్‌ కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగబోతోంది. చివరి వన్డేలో కూడా విజయం సాధిస్తే భారత్‌ చేతిలో ఆసీస్‌ తొలిసారి వైట్‌వాష్‌ అయినట్టవుతుంది.


ఈ మ్యాచ్‌కు భారత జట్టులో 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మొదటి రెండు వన్డేల్లో ఆడిన శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చామని, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ షమి వ్యక్తిగత కారణాలతో తమ ఇళ్లకు వెళ్లారని రోహిత్ పేర్కొన్నాడు. మూడో వన్డేకు అందుబాటులో ఉండాల్సిన హార్దిక్ పాండ్య కూడా వ్యక్తిగత కారణాలతో ఇంకా ఇంటి వద్దే ఉన్నట్లు చెప్పాడు. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. రెండో వన్డేలో ఆడని బుమ్రా కూడా రాజ్‌కోట్‌లో టీమ్‌తో చేరాడు.

ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే చాన్సుంది. ఇక్కడ జరిగిన మూడు వన్డేల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే విజయాలు సాధించాయి. కాగా రోజులో ఎక్కువభాగం ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ముఖేశ్‌ కుమార్.

Tags

Read MoreRead Less
Next Story