India Vs England: తొలి టెస్టు వర్షార్పణం

India Vs England: టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిదైన ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడలేదు. ఆఖరి రోజు భారత్ విజయానికి 157 పరుగుల దూరంలో ఉంది. మరో తొమ్మిది వికెట్లు చేతిలో ఉండటంతో భారత్ విజయం లాంఛనమే అని అంతా భావించారు. అయితే వర్షం కారణంగా ఒక బంతి కూడా పడలేదు. చివరి సెషన్ వరకూ చూసినా వాతావరణం అనుకూలించపోవడంతో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ విజయం సాధించాల్సిన తొలి టెస్టు డ్రాగా నిలిచింది.
రెండో ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (109; 172 బంతుల్లో 14x4)శతకం సాధించాడు. మరోవైపు భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, శార్ధూల్ చెరో 2 వికెట్లు సాధించారు. షమి ఒకటి తీశాడు. అనంతరం భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 52/1తో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (26; 38 బంతుల్లో 6x4) ఔటైనా రోహిత్ శర్మ (12; 34 బంతుల్లో), చెతేశ్వర్ పుజారా (12; 13 బంతుల్లో 3x4) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
తొలి ఇన్నింగ్స్లోనూ రూట్ (64; 108 బంతుల్లో 4x4) అర్ధశతకంతో రాణించాడు. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్ ఆడగా 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (56) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లిష్ బౌలర్లలో రాబిన్సన్ 5, అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో 95 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్ డ్రాకావడంతో రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఇరు జట్లకూ చెరో నాలుగు పాయింట్లు దక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com