CRICKET: అనధికార టెస్టులో భారత బ్యాటర్ల జోరు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (80) సైతం హాఫ్ సెంచరీ బాదగా భారత ‘ఏ’ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లను ఉతికేసిన ఈ ఇద్దరూ మంచి పునాది వేయగా నితీశ్ రెడ్డి (42) కూడా బ్యాట్ ఝులిపించాడు. కాసేపట్లో లంచ్ అనగా శార్దూల్ ఠాకూర్(34)ను జార్జ్ హిల్ బౌల్డ్ చేశాడు. దాంతో, భారత్ 7 వికెట్ల నష్టానికి 268 రన్స్ చేసింది.
తొలి ఇన్నింగ్స్ లోనూ భారీ స్కోరు
తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసిన భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ అదే పంథాలో సాగింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ను 327కే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం దీటుగా ఆడుతోంది. ఓవర్ నైట్ స్కోర్తో 75 -1 నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించగా కేఎల్ రాహుల్(51), అభిమన్యు ఈశ్వరన్(80)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. 88 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఎడ్డీ జాక్ విడదీశాడు. రాహుల్ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (15) స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరాడు. ఈశ్వరన్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఆడాడు. ధ్రువ్ జురెల్(28)తో కలిసి స్కోర్బోర్డును ఉరికించాడు. సెంచరీ దిశగా వెళ్తున్న అతడిని క్రిస్ వోక్స్ ఔట్ చేసి ఇంగ్లండ్కు బ్రేకిచ్చాడు. నితీశ్ రెడ్డి(42), శార్ధూల్ ఠాకూర్(34)లు ప్రత్యర్థి బౌలర్లను విసిగిస్తూ బౌండరీలతో చెలరేగారు. ఇద్దరూ ధనాధన్ ఆడి స్కోర్ బోర్డును 250 దాటించారు. ప్రమాదకరంగా మారిన వీళ్లను జార్జ్ హిల్(3-39) బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. లంచ్ సమయానికి భారత్ 289 పరుగుల ఆధిక్యంలో ఉండగా తనుష్ కొతియాన్ (7) క్రీజులో ఉన్నాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. ప్రత్యర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com