Canada Open: పీవీ సింధు ఇంటికి, లక్ష్యసేన్ ఫైనల్కు

బ్యాడ్మింటన్లో కెనడా ఓపెన్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత ఏస్ షట్లర్ పీవీ సింధు తన పేలవ ఫామ్ని కొనసాగిస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు, వరల్డ్ నంబర్ 19 ర్యాంకర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్కి చెందిన, వరల్డ్ 11వ ర్యాంక్ క్రీడాకారుడు నిషిమోతోను 21-17, 21-14 వరుస సెట్లలో ఓడించి ఫైనల్కు చేరాడు. ప్రత్యర్థి నుంచి లక్ష్యసేన్కు మొదటి సెట్లో తప్ప, పెద్దగా ప్రతిఘటన ఎదురవ్వలేదు. మొదటి సెట్లో 1-4 తేడాతో వెనకబడ్డ సేన్ తర్వాత అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ని గెలిచాడు. 44 నిమిషాల పాటు కొనసాగిన మ్యాచ్లో లక్ష్యసేన్ తన పవర్ షాట్స్, పట్టుదలతో కోర్టులో తిరుగుతూ పవర్ఫుల్ షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించాడు. నిషిమోతో తలపడ్డగా 2 విజయాలతో లక్ష్యసేన్ పైచేయి సాధించాడు. కొడై నరోకా, లీ షి ఫెంగ్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో లక్ష్యసేన్ ఫైనల్లో ఆదివారం తలపడనున్నాడు. ఈ సీజన్లో అత్యుత్తమంగా థాయిలాండ్ ఓపెన్లో 3వ స్థానంలో నిలిచాడు.
ఇక మహిళల సింగిల్స్లో కెనెడా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి, వరల్డ్ 15వ ర్యాంకర్ పివీ సింధు కథ ముగిసింది. వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్ అకాన్ యమగుచితో జరిగిన సెమీ ఫైనల్లో 14-21, 15-21 వరుస సెట్లను కోల్పోయి ఇంటి ముఖం పట్టింది. దీంతో ఇంతకు ముందు ఇదే క్రీడాకారిణితో సింగపూర్ ఓపెన్లో ఓడిన సింధు వరుసగా రెండో సారి ఓడింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇంతవరకే ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. తను చివరగా 2022 ఆగస్ట్లో కామన్వెల్త్ పోటీల్లో పతకం గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com