ICC: ఆ మ్యాచ్పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం కన్ను

టీ20 ప్రపంచ కప్ ముగిసి నెలన్నర రోజులు గడిచిన తర్వాత, గ్రూప్ స్టేజ్లో జరిగిన కెనడా - న్యూజిలాండ్ మ్యాచ్పై ఇప్పుడు ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ (ACU) దృష్టి సారించింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కెనడా క్రికెట్ బోర్డు ఫిక్సింగ్కు పాల్పడిందంటూ ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ అనే ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన ఐసీసీ, రెండు ప్రత్యేక బృందాలతో విచారణను ప్రారంభించింది. సూపర్-8 రేసులో నిలవడానికి కీలకంగా మారిన ఈ పోరులో జరిగిన కొన్ని పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్పై ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి.
టోర్నీకి కేవలం మూడు వారాల ముందే సారథిగా బాధ్యతలు చేపట్టిన బజ్వా, ఆ ఓవర్లో ధారాళంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు 35/2 స్కోరుతో నెమ్మదిగా ఉన్న కివీస్ ఇన్నింగ్స్, ఆ ఓవర్తో ఒక్కసారిగా వేగం పుంజుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఈ క్రమంలోనే కెనడా క్రికెట్ బోర్డు సభ్యులు, జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించిన మాజీ కోచ్ ఖుర్రమ్ చోహాన్ ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నారు. నిర్దిష్ట ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకోవాలని ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా, ఓపెనర్ యువరాజ్ సమ్రా (110) సెంచరీతో 173/4 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సాధించింది. ఐసీసీ తాత్కాలిక జీఎం ఆండ్రూ ఎఫ్ గ్రేవ్ స్పందిస్తూ, ఇలాంటి ఆరోపణలపై ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేమని, ఏసీయూ విచారణ పూర్తయిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
