టీమిండియా ఆటగాళ్ళపై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు!
ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా చరిత్రలో ఇంతపెద్ద విజయం ఎప్పుడూ లేదన్న ఆయన.. ఇలాంటి జట్టును తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. టెస్టుల్లో అనుభవమే లేని ఆటగాళ్ళతో.. ఆస్ట్రేలియా లాంటి జట్టును వారి సొంతగడ్డపై ఓడించడం గొప్ప విషయమన్నాడు.
కోహ్లీ, అశ్విన్, జడేజా, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని అన్నాడు. ఇక తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె నాయకుడిగా సత్తా చాటాడని మెచ్చుకున్నాడు. అటు యువ ఆటగాళ్ల వెనక రాహుల్ ద్రవిడ్ ఉన్నాడని.. అండర్ 19లో వాళ్లను రాటుదేల్చాడని చెప్పాడు.
ద్రవిడ్ భారత జట్టుకు ఆడేటప్పుడు ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఎంతో మానసిక స్థైర్యంతో ఆడేవాడని ఇంజమామ్ గుర్తుచేశాడు. అలాగే భారత విజయంలో హెడ్కోచ్ రవిశాస్త్రి సేవల్ని అందరూ మర్చిపోయారని, అతడి వల్లే భారత్ సిరీస్ గెలిచిందని ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com