IPL: చెన్నైకి వరుసగా రెండో ఓటమి

IPL: చెన్నైకి వరుసగా రెండో ఓటమి
X
ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ గెలుపు... రాణించిన నితీశ్ రాణా, హసరంగ

ఐపీఎల్‌లో భాగంగా గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 176/6 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్‌ (63), జడేజా (31*) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌ బోణీ కొట్టింది.

నితీశ్ రాణా తుఫాన్ ఇన్నింగ్స్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌లో నితీశ్‌ రాణా తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. నితీశ్‌ రాణా 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి రాజస్థాన్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఈ మ్యాచులో తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ జైస్వాల్‌ (4)ను పేసర్‌ ఖలీల్‌ అవుట్‌ చేశాడు. నితీశ్ రాణా కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. దీంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 182/9 స్కోరు చేసింది. రియాన్‌ పరాగ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) రాణించాడు. నూర్‌, పథిరన, ఖలీల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 176/6 స్కోరుకే పరిమితమైంది.

పోరాడినా ఓటమి తప్పలేదు

ఈ మ్యాచులో ఆఖరి ఓవర్‌ వరకు చెన్నై పోరాడింది. కానీ రాజస్థాన్‌ రాయల్స్‌ పట్టు వదల్లేదు. స్పిన్నర్‌ వనిందు హసరంగ (4/35) మ్యాజిక్‌ బంతులు తోడవ్వడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. దీంతో ఆడిన మూడో మ్యాచ్‌లో రాజస్థాన్‌ బోణీ చేయగా.. చెన్నైకిది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచులో రచిన్‌ డకౌట్‌ కాగా, కెప్టెన్‌ రుతురాజ్‌ (63) ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (23)తో కలిసి రుతురాజ్‌ రెండో వికెట్‌కు 46 రన్స్‌ జోడించాడు. శివమ్‌ దూబే (18), విజయ్‌ శంకర్‌ (9) విఫలంకాగా కీలక సమయంలో రుతురాజ్‌ను హసరంగ దెబ్బతీశాడు. ఈ దశలో జడేజా (32 నాటౌట్‌)-ధోనీ (16) గెలిపించే ప్రయత్నం చేశారు.

ధోనిపై ట్రోల్స్ మోత

క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న MS ధోని ప్రస్తుతం తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. IPLలో అంచనాలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం లేదు. తాజాగా RRతో జరిగిన మ్యాచ్‌లో 8వ స్థానంలో వచ్చాడు. 7 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉన్నా బ్యాట్ విదల్చలేదు. కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆసియా కప్‌లో పాక్‌పై విరాట్ ఇన్నింగ్స్‌తో పోలుస్తూ ధోనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Next Story