IPL: ఐపీఎల్ - 2025 షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే మార్చి 21వ తేదీ నుంచి సీజన్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. వాస్తవానికి బీసీసీఐ ఎప్పుడైనా.. ఐపీఎల్ షెడ్యూల్ను చివరి నిమిషంలో విడుదల చేసేది. అయితే ఈసారి మాత్రం ఆ ఆనవాయితీకి బీసీసీఐ చెక్ పెట్టి రెండు నెలల ముందుగానే షెడ్యూల్ ప్రకటించింది. IPL 18వ సీజన్ మార్చి 21న ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ మే 25న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తేదీలకు సంబంధించి తుది సంప్రదింపులు జరుగుతున్నాయని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి సలహా సమావేశం 18-19 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఐపీఎల్-2025లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు
ఐపీఎల్-2025 సీజన్ నుంచి ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది. ఈ మేరకు ఆదివారం బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ‘మార్చి 21న ప్రారంభం అయ్యే ఐపీఎల్ సీజన్లో నిబంధనలను అతిక్రమించిన ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం కొనసాగుతున్నాయి.’ అని ఐసీసీ జీసీ మెంబర్ ఒకరు పీటీఐకి తెలిపారు.
ఇటీవలే ముగిసిన వేలం
అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకూడదనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఇటీవలే ఐపీఎల్ మెగా వేలం దుబాయ్ వేదికగా జరిగింది. ఈ వేలంలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) అత్యధిక ధర పలకగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com