ipl: సామాన్యులకు దూరంగా ఐపీఎల్ టికెట్లు

హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ సందడితో కళకళలాడుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లకు ఎప్పటిలాగే భారీ ఆదరణ కనిపిస్తున్నా, ఈసారి టిక్కెట్ల వ్యవహారం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మహేంద్ర సింగ్ ధోనీని ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తుండగా, టిక్కెట్ల ధరలు భారీగా పెరగడం, అలాగే క్షణాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అవుతున్న పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్వహణలో ఉన్న ఈ మ్యాచ్కు సంబంధించి టిక్కెట్ ధరలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. సాధారణంగా మధ్యతరగతి అభిమానులు కొనుగోలు చేసే సౌత్ ఈస్ట్, వెస్ట్ టెర్రస్ టిక్కెట్లు గతంలో రూ.1250గా ఉండగా, ఈసారి అవి నేరుగా రూ.2500కు పెంచడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇదే విధంగా ఈస్ట్, వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ టిక్కెట్ల ధరలను రూ.2250 నుంచి రూ.3500కు పెంచగా, కార్పొరేట్ బాక్సుల ధరలు రూ.23 వేల నుంచి రూ.33 వేల వరకు పెరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. టిక్కెట్ ధరలపై అదనంగా బుకింగ్ చార్జీలు కూడా రూ.300 నుంచి రూ.2000 వరకు వసూలు చేయడం మరింత భారంగా మారింది.
ముఖ్యంగా చెన్నై మ్యాచ్ కావడంతో డిమాండ్ పెరిగినప్పటికీ, ధరలను ఇంతగా పెంచడంపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ ఆటను ఒకసారి అయినా ప్రత్యక్షంగా చూడాలన్న కోరికతో టిక్కెట్లు కొనుగోలు చేయాలని యాప్లలో ప్రయత్నించే సరికి భారీ క్యూ లైన్లు కనిపించడం, చివరికి క్షణాల్లోనే టిక్కెట్లు అయిపోయినట్లు చూపించడం అభిమానుల్లో అనుమానాలకు దారితీసింది. చాలామంది యాప్ ఓపెన్ చేసిన వెంటనే “సోల్డ్ అవుట్” సందేశం కనిపించిందని చెబుతున్నారు. టిక్కెట్ల విక్రయ ప్రక్రియలో పారదర్శకత లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మ్యాచ్కు ముందు ఇతర జట్లు సాధారణంగా టిక్కెట్ల ధరలు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ముందుగానే వెల్లడిస్తుంటే, ఈ విషయంలో ఎస్ఆర్హెచ్ మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని అభిమానులు విమర్శిస్తున్నారు. టిక్కెట్లలో పెద్ద భాగాన్ని యాప్లో అందుబాటులో ఉంచకుండా, కాంప్లిమెంటరీ పాస్లు లేదా సిఫార్సుల ద్వారా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది కేవలం ధరల పెంపు సమస్య మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకుడికి మ్యాచ్ చూడడం కష్టమవుతోందనే భావనను కూడా కలిగిస్తోంది. క్రికెట్పై అపారమైన అభిమానం కలిగిన తెలుగు రాష్ట్రాల అభిమానులు తమ ఇష్టమైన జట్టును, ఇష్టమైన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అధిక ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐపీఎల్ క్రమంగా సామాన్య ప్రజలకు అందని దూరంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ధోనీ ప్రభావం కూడా టిక్కెట్ డిమాండ్పై స్పష్టంగా కనిపిస్తోంది. ధోనీ మ్యాచ్ అంటే స్టేడియంలో ప్రత్యేక వాతావరణం ఉండడం సహజం. అతని చివరి దశ కెరీర్ నేపథ్యంలో ప్రతి మ్యాచ్కు డిమాండ్ మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని టిక్కెట్ ధరలను రెట్టింపు చేయడం సరైంది కాదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికల్లో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టిక్కెట్ ధరల పెంపుతో పాటు, విక్రయ విధానంపై కూడా వివరణ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మారు, ఎన్ని కాంప్లిమెంటరీ పాస్లుగా ఇచ్చారు అనే వివరాలను బహిరంగంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు అభిమానుల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
