IND-PAK MATCH: పాకిస్థానే హాట్‌ ఫేవరెట్‌ అట

IND-PAK MATCH: పాకిస్థానే హాట్‌ ఫేవరెట్‌ అట
X
టీమిండియాపై నోరు పారేసుకున్న పాక్‌ మాజీ ఆటగాడు... బాబార్‌ సేనపై రోహిత్‌ సేన గెలవలేదని గొప్పలు...

భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌(ind-pak match) అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల ప్రజలు దీన్ని మ్యాచ్‌లా కాకుండా ఓ చిన్నపాటి యుద్దంలా చూస్తారు. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెటర్లు కోరుకుంటారు. ఈ వన్డే వరల్డ్‌కప్‌-2023(world cup)లో భారత్‌-పాక్‌ల మధ్య జరుగబోయే హైఓల్టేజీ మ్యాచ్‌ కోసం ఇప్పటి నుంచే అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో భారత్‌పై పాక్‌ మాజీ ఆటగాడు నోరు పారేసుకున్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టే ఫేవరట్‌ అని గొప్పలకు పోయాడు.


పాక్‌ వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆకిబ్‌ జావిద్‌(former Pakistan pacer, Aaqib Javed ) టీమిండియాపై నోరు పారేసుకున్నాడు. అహ్మదాబాద్‌ వేదకగా అక్టోబర్‌ 14న జరిగే దాయాదుల పోరులో బాబర్‌ ఆజమ్‌(Babar Azam ) నేతృత్వంలోని పాకిస్తాన్‌ జట్టే ఫేవరెట్‌ అని వెల్లడించాడు. ఇంతటితో ఆగకుండా టీమిండియా(team india)ను కించపరిచే విధంగా అతి విమర్శలు చేశాడు. రోహిత్‌(rohit) సారధ్యంలోని ప్రస్తుత భారత జట్టుకు ఫిట్‌నెస్‌, ఫామ్‌ రెండూ అంతంతమాత్రమేనని ఆరోపించాడు. ప్రస్తుత జట్టుతో టీమిండియా తమపై గెలవలేదని ప్రగల్భాలు పలికాడు. భారత్‌తో పోలిస్తే పాక్‌ జట్టు అన్ని విభాగాల్లో బలంగా, సమతూకంగా ఉందని.. టీమిండియాలోని ఆటగాళ్లు పేరుకే పెద్ద ఆటగాళ్లని.. పాక్‌తో మ్యాచ్‌లో సో కాల్డ్‌ బిగ్‌ ప్లేయర్స్‌ అంతా తడబడటం ఖాయమని జోస్యం చెప్పాడు. భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే వారికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం బెటర్‌ అని కూడా సూచించాడు. ఈ విమర్శలతో సోషల్‌ మీడియాలో భారత నెటిజన్లు చెలరేగిపోయారు. వరల్డ్‌ కప్‌లో పాక్‌పై భారత్‌ గెలిచిన మ్యాచ్‌ల వీడియోలను పోస్ట్‌ చేస్తూ కౌంటర్‌ ఇస్తున్నారు.

వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌లు ఏడు సార్లు ఎదురెదురుపడగా అన్ని సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది. తొలుత ప్రకటించిన వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగాల్సి ఉండింది. అయితే మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఆ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంకానుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను ఒక రోజు ముందు ప్రీ పోన్‌ చేశారు. ఈ మ్యాచ్‌తో పాటు ఐసీసీ మరో ఎనిమిది మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది. పలు రకాల కారణాల చేత ఐసీసీ తప్పనిసరి పరిస్థితుల్లో షెడ్యూల్‌ను మార్చింది. ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కంటే ముందే భారత్‌-పాక్‌లు ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్‌ 2న తలపడనున్న విషయం తెలిసిందే.

Next Story