BUMRAH: ఛాంఫియన్స్ ట్రోఫికి బుమ్రా దూరం?

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా BGT చివరి టెస్టులో గాయపడ్డ టీమిండియా పేసర్ బుమ్రా కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలని బుమ్రాకు సూచించారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటన అనంతరం బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ దశలో బుమ్రాను తొందరపెట్టే అవకాశం లేదని సమాచారం. దీంతో వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో అతనాడటం అనుమానంగా మారింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి టెస్ట్ సందర్భంగా బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. స్వదేశం తిరిగొచ్చాక అతడు గతంలో వెన్ను నొప్పికి చికిత్స చేయించుకున్న న్యూజిలాండ్ డాక్టర్నూ సంప్రదించాడు. ఇక..వెన్ను నొప్పి నుంచి కోలుకొనేందుకుగాను బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అతడు ఎన్సీఏకి వెళ్లడంపై సందిగ్ధం ఏర్పడింది.
మోర్కల్తో గౌతమ్ గంభీర్కు విభేదాలు
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్కు గంభీర్కు మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సమయంలో అతడు జట్టుతో అంటీముట్టనట్లు వ్యవహరించాడని, ఈ క్రమంలోనే మోర్కల్పై గంభీర్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ కూడా చాలా సీరియస్గా స్పందించినట్లు సమాచారం.
బయట అనుకునేవన్నీ నిజాలు కావు: అశ్విన్
భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు ఆస్ట్రేలియా టూర్లో అవమానం జరగడం వల్లే రిటెర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారంపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించారు. తన రిటైర్మెంట్ గురించి బయట అనుకొనేవన్నీ నిజాలు కాదని.. తాను బ్రేక్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, అందుకే ఈ సిరీస్ మధ్యలోనే బయటకి వచ్చేశానని అశ్విన్ చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com