ICC: టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా

ICC: టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా
X
వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మంధాన, ఒమర్జాయ్

భారత పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వరించింది. గతేడాది 13 టెస్టులు ఆడిన జస్‌ప్రీత్‌ బుమ్రా మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో జనవరి 4న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లాండ్‌పై 19 వికెట్లు, బంగ్లాదేశ్‌పై 11 వికెట్లు, న్యూజిలాండ్‌పై 3 వికెట్లు, ఆస్ట్రేలియాపై 38 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.

ఆరో భారత క్రికెటర్..

టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్‌ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) బుమ్రా కంటే ముందు ఈ అవార్డు అందుకున్నారు. 2024 ఐసీసీ టెస్టు జట్టులోనూ బుమ్రా చోటు దక్కింది. గతేడాది టెస్టుల్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2024లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మంధాన

ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్‌ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలున్నాయి. లారా, టామీ బ్యూమాంట్, హేలీ మాథ్యూస్‌ను వెనక్కి నెట్టి అవార్డుకు ఎంపికైంది. మంధాన గతేడాది వన్డేల్లో అదరగొట్టింది.

‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ ఒమర్జాయ్

ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్ ప్రతిష్టాత్మక ఐసీసీ మెన్స్‌ ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2024’ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ ఒమర్జాయ్‌ను ఈ అవార్డు వరించింది. అతడు గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. 2024లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు మొత్తం 14 వన్డేలు ఆడగా, అందులో 8 విజయాలు సాధించింది.

Tags

Next Story