IPL: ముందడుగు వేసిన ముంబై

ముంబై అదరగొట్టింది. అయిదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్, ఆరో ట్రోఫీ దిశగా మరో అడుగు ముందుకేసింది. టోర్నీని పేలవంగా ఆరంభించినా అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ముంబై.. ఎలిమినేటర్లో దంచి కొట్టింది. రోహిత్ బ్యాటుతో విధ్వంసం సృష్టించిన వేళ.. ఆసక్తికర పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టైటాన్స్ కొండంత లక్ష్య ఛేదనలో గొప్పగానే ఆడినా ఫలితం లేకపోయింది. సాయి సుదర్శన్ పోరాటం వృథా అయింది. బుమ్రా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గుజరాత్ నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రోహిత్ విధ్వంసం
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ధనాధన్ ఆటతీరుతో హోరెత్తించింది. క్రీజులోకి ఓపెనర్ బెయిర్స్టో తుఫాన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ రోహిత్ నిలకడగా కొనసాగాడు. చివర్లో హార్దిక్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో భారీ స్కోరు సాధ్యమైంది. వాస్తవానికి రోహిత్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు కొట్జీ సులువైన క్యాచ్ను వదిలేశాడు. రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9×4, 4×6) చెలరేగడంతో మొదట ముంబయి 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. బెయిర్స్టో (47; 22 బంతుల్లో 4×4, 3×6) మెరిశాడు. ఆరో ఓవర్లో రోహిత్ 6,4,4తో పవర్ప్లేలో జట్టు 79 పరుగులు సాధించింది. రోహిత్కు తోడు తిలక్ వర్మ (25; 11 బంతుల్లో 3×6) బ్యాట్ ఝళిపించడంతో ముంబయి 16.3 ఓవర్లలో 176/2తో నిలిచింది. అయితే రోహిత్, తిలక్ వర్మ, నమన్ ధీర్ (9) లను వరుస ఓవర్లలో వెనక్కి పంపిన టైటాన్స్.. పరుగుల ప్రవాహాన్ని కాస్త అడ్డుకోగలిగింది. కానీ చెలరేగి ఆడిన హార్దిక్ (22 నాటౌట్; 9 బంతుల్లో 3×6) మూడు సిక్స్లు బాదడంతో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కొయెట్జీ ఏకంగా 22 పరుగులు ఇచ్చుకున్నాడు.
సుదర్శన్ మెరిసినా..
అసలే కొండంత లక్ష్యం. ఆపై ఫామ్లో ఉన్న బ్యాటర్ గిల్ తొలి ఓవర్లోనే వెనుదిరగడం పెద్ద షాక్. అయినా ఛేదనలో గుజరాత్ పోటీలో నిలిచింది. కారణం మరో ఓపెనర్ సాయి సుదర్శన్. టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న సుదర్శన్.. మరోసారి తన విలువను చాటుకున్నాడు. సాయి సుదర్శన్ (80; 49 బంతుల్లో 10×4, 1×6) పోరాటం సరిపోలేదు. వాషింగ్టన్ సుందర్ (48; 24 బంతుల్లో 5×4, 3×6) రాణించాడు. బుమ్రా (1/27) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్వని కుమార్ (1/28), బౌల్ట్ (2/56) రాణించారు. ముంబయి ఇక ఫైనల్లో స్థానం కోసం ఆదివారం క్వాలిఫయర్-2లో పంజాబ్తో తలపడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com