SIRAJ: సిరాజ్ భాయ్కు గ్రాండ్ వెల్కమ్

టీ 20 వరల్డ్కప్లో విజయం సాధించి రోజులు గడుస్తున్న తర్వాత కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. భారత్ కు వచ్చిన ఆటగాళ్ళను ప్రధాని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలుపటం, తరువాత ముంబైలో విజయోత్సవ పరేడ్కు భారీగా అభిమానులు తరలిరావటం కూడా తెలిసిందే. తరువాత జట్టులోని ఆటగాళ్లు వారి కుటుంబాల వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులు వారికి వచ్చిన ఆత్మీయ ఆహ్వానం ఫోటోలు షేర్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2024 విజేత భారత్ జట్టులో సభ్యుడైన సిరాజ్కు హైదరాబాద్లో క్రికెట్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇండియాకు మరిన్ని ప్రపంచకప్లు తీసుకురావడమే తన లక్ష్యమని సిరాజ్ తెలిపాడు. మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆస్పత్రి వద్ద పీవీ ఎక్స్ప్రెస్పై జీప్ ఓపెన్ టాప్ నుంచి సిరాజ్ అభివాదం చేశాడు. రాత్రి ఏడున్నరకు ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, ఖాజామేన్షన్, పోలీసాఫీసర్స్మెస్, నషేమన్ హోటల్ మీదుగా ఫస్ట్లాన్సర్లోని ఈద్గా మైదానం వరకు సాగింది.
రోహిత్ను సన్మానించిన మాహరాష్ట్ర సీఎం
టీ ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లు... మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేను కలిశారు. టీమిండియా సారధి రోహిత్ శర్మ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే... ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్షలో ఏక్నాథ్ శిందేను కలిశారు. భారత క్రికెటర్లకు స్వాగతం పలికిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి.... వారిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. టీమిండియా ఆటగాళ్లు... టీ 20 ప్రపంచకప్లో తమ అనుభవాలు.. భారత్కు వచ్చిన తర్వాత లభించిన అపూర్వ స్వాగతం గురించి ఏక్నాథ్ శిందేకు వివరించారు. దేశవాళీ క్రికెట్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్, శివమ్ దూబే.. యశస్వీ జైస్వాల్ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ముంబైకు చెందినవారు కాగా... శివమ్ దూబే, యశస్వీ జైస్వాల్ ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయికి వచ్చి స్థిరపడ్డారు.
టీ20 ప్రపంచకప్లో పాల్గొన్న నలుగురు ముంబై ఆటగాళ్లను మహారాష్ట్ర విధాన్ భవన్ కాంప్లెక్స్లో సన్మానించనున్నట్లు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇప్పటికే ప్రకటించారు. విశ్వ విజేతలుగా నిలిచిన ముంబై ఆటగాళ్లను సత్కరించాలనే నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు కూడా అయిన ఏక్నాథ్ శిందే తీసుకున్నారని ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ప్రపంచకప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, యశస్వీ జైస్వాల్ ముంబైకి చెందిన వారు కావడం ముంబైకర్లకు గర్వకారణమని సర్నాయక్ తెలిపారు. 2007, 2011లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లను మహారాష్ట్ర ప్రభుత్వం సత్కరించిందని.. ఇప్పుడు కూడా అదే చేస్తామని ఆయన తెలిపారు. ఆటగాళ్ల సన్మానానికి ఎమ్మెల్యేలందరూ హాజరయ్యేలా చూడాలని సర్నాకర్ చేసిన సూచనకు.... స్వీకర్ నార్వేకర్ వెంటనే అంగీకారం తెలిపారు. ఐసీసీ ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ మహారాష్ట్ర ఉభయ సభలు ఇప్పటికే తీర్మానాలు చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com