NEERAJ CHOPRA: నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా

భారతదేశ స్టార్ ఒలింపిక్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు భారత సైన్యం అత్యున్నత గౌరవాన్ని అందించింది. క్రీడల్లో ఆయన సాధించిన అసాధారణ విజయాలు, దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచినందుకు గాను నీరజ్కు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైనిక దళాల అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఈ పదోన్నతిని అధికారికంగా అందించారు. ఈ నియామకం ఏప్రిల్ 16 నుండి అమలులోకి వచ్చినట్లు 'ది గెజెట్ ఆఫ్ ఇండియా' ద్వారా తెలుస్తుంది. నీరజ్ చోప్రా సైన్యంతో తన ప్రయాణాన్ని 2016లో నాయిబ్ సుబేదార్గా ప్రారంభించారు. ఆ తర్వాత 2021లో సుబేదార్గా, 2022లో సుబేదార్ మేజర్గా పదోన్నతి పొందారు. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్, భారతదేశంలో అథ్లెటిక్స్, ముఖ్యంగా జావెలిన్ త్రో క్రీడకు ఒక కొత్త తరంగాన్ని సృష్టించారు. 2018లో అర్జున అవార్డు అందుకున్న ఆయన 2021లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డును పొందారు. సైన్యంలో ఆయన చేసిన సేవలకు గాను 2022లో పరమ విశిష్ట సేవా పతకం (PVSM), అదే సంవత్సరంలో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించబడ్డారు. లెఫ్టినెంట్ కల్నల్ పదవిని అందుకోవడం ద్వారా నీరజ్ చోప్రా దేశంలోని లక్షలాది మంది యువతకు నిరంతర ప్రేరణగా నిలుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com