OLYMPICS: మను బాకర్‌పై ప్రశంసల జల్లు

OLYMPICS: మను బాకర్‌పై ప్రశంసల జల్లు
X
దేశం గర్విస్తోందన్న రాష్ట్రపతి... ఈ విజయం ప్రత్యేకమన్న మోదీ

పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన భారత ప్లేయర్ మను భాకర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. భారతదేశానికి పతకాన్ని తీసుకొచ్చిన మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్‌ చేశారు. మను భాకర్ పట్ల భారతదేశం గర్విస్తోందని... ఆమె విజయం చాలా మంది క్రీడాకారులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. మను భాకర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్ లో పతకం సాధించిన మెుదటి మహిళ కావడం వల్ల ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అమిత్‌ షా కూడా మను బాకర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


మను బాకర్‌ చరిత్ర

ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను బాకర్‌ కాంస్యం సొంతం చేసుకుంది. విశ్వ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది. విశ్వ క్రీడల్లో భారత్ పతకాల బోణి కొట్టింది. తొలిరోజు నిరాశే ఎదురైనా, పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ కు తొలి పతకం లభించింది. షూటింగ్‌లో మనుబాకర్‌ భారత్‌కు తొలి పతకం అందించింది. 10మీ.ఎయిర్‌ పిస్టల్‌ మహిళల ఫైనల్‌ లో కాంస్యం సాధించింది. తొలి పతకంతో త్రివర్ణ పతకాం రెపరెపలాడించింది. షూటింగ్ లో భారత్ కు మెడల్ సాధించిన తొలి మహిళా షూటర్ గా చరిత్ర లిఖించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ యే జిన్ స్వర్ణం కైవసం చేసుకుంది. అదే దేశానికి చెందిన కిమ్ యేజి రజతంతో సరిపెట్టుకోగా, భారత్ కు చెందిన మను బాకర్ కాంస్యం నెగ్గింది. స్వర్ణం సాధించిన ఓ యే జిన్ ఓవరాల్ గా 242.2 పాయింట్లతో సత్తా చాటింది. రజతం సాధించిన కిమ్ యేజి 241.3 పాయింట్లు, మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించింది.

నన్ను నడిపించింది భగవద్గీతే

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మహిళా షూటర్‌గా మను బాకర్ చరిత్ర సృష్టించింది. అయితే తన గెలుపులో భగవద్గీత కీలక పాత్ర పోషించిందని విజయం అనంతరం బాకర్‌ వ్యాఖ్యానించింది. అర్జునుడికి కృష్ణుడు చేసిన హితోపదేశమే తనకు మార్గ నిర్దేశం చేసిందని తెలిపింది. మీరు కర్మపై దృష్టి పెట్టండని.. ఫలితంపై కాదన్న భగవద్గీత శ్లోకమే తనలో స్ఫూర్తి నింపిందని వెల్లడించింది.

Tags

Next Story