IPL: రాయల్స్‌ మరీ ఇంత దారుణంగానా..?

IPL: రాయల్స్‌ మరీ ఇంత దారుణంగానా..?
X
ఐపీఎల్‌లో రాజస్థాన్ పోరాటం ముగిసినట్లే..! మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు నో ఛాన్స్

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ఆల్మోస్ట్ ముగిసింది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆర్ఆర్ చేజేతులారా తన ఓటములను సృష్టించుకుంది. ఒకవైపు అంతర్గత వివాదాలు, ప్లేయర్ల వైఫల్యం, కెప్టెన్సీ లోపం ఆర్ఆర్‌ను ప్లే ఆఫ్స్ నుంచి దూరం చేశాయి. దీంతో ఎదో మహాద్భుతం జరిగిన కూడా రాజస్థాన్ ప్లే ఆఫ్‌కు చేరడం కష్టంగానే మారింది. అసలు రాయల్స్ పతనానికి పునాది మెగా ఆక్షన్ నుంచే ప్రారంభమైందా? లేకపోతే స్టేడియంలో పొరపాట్లు జరిగాయా? రాహుల్ ద్రావిడ్ లాంటి సుధీర్ఘ అనుభవం కలిగిన హెడ్ కోచ్, ఛాంపియన్ స్పిరిట్ కలిగిన టీంకు ఏమైంది? గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలు నిర్జీవంగా మారాయి. ఇంకా ఆడాల్సిన 5 మ్యాచ్‌ల్లో 5 గెలిచినా ప్లే ఆఫ్‌కు చేరుకోలేరు.

చేతులారా చేసుకున్నారు

అవును.. రాజస్థాన్ పరాజయాలకు ఇతర టీంల పర్ఫామెన్స్ కంటే రాయల్స్ ఆటగాళ్లు చేజేతులా చేసుకున్న దారుణ వైఫల్యాలే కొంపముంచాయి. ఆ చిన్న పొరపాట్లు చేసి ఉండకపోతే పాయింట్స్ టేబుల్‌లో టాప్ 4లో నిలిచే వారు. వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోగా చివరి మూడు మ్యాచ్‌ల్లో లాస్ట్ ఓవర్‌లో అనూహ్యంగా ఓడిపోయారు. ఈ విషయాన్నీ ఫ్యాన్స్‌కాదు కదా ఏ క్రికెట్ ఎనలిస్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏప్రిల్ 16న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈజీ విన్ కావాల్సింది. చెత్త షాట్లకు వెళ్లి ఆర్ఆర్ బ్యాటర్లు మ్యాచ్‌ని టై వరకు తీసుకొచ్చారు. దీంతో సూపర్ ఓవర్ వచ్చింది. సూపర్ ఓవర్లో రెండు బంతులు మిగిలుండగానే బ్యాటర్లు సొంత తప్పిదాలతో అవుట్ అయిపోయారు. దీంతో ఢిల్లీ క్రేజీ విన్. ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌కు చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజ్‌లో ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మేయర్ లాంటి ఇద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు ఉన్నారు. నిలకడగా ఆచితూచి ఆడాల్సిన సమయంలో మరో చెత్త షాట్‌కు వెళ్లి హెట్మేయర్ వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ మ్యాచే కోల్పోవాల్సి వచ్చింది. స్టేడియం అంత షాక్. గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లియర్‌గా గెలిచే పొజిషన్. కానీ.. చివరి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయి.. ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన తొలి టీంగా మారింది.

సంజు కెప్టెన్సీ చేయకపోవడం వల్లేనా..?

రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్‌ లేకపోవడం టీమ్‌ రిథమ్‌కి అంతరాయం కలిగించిందని ఆ జట్టు ఆటగాడు సందీప్ తెలిపాడు. ‘కొన్నిసార్లు కెప్టెన్ ప్రశాంతతను తెస్తాడు, మంచి ఫీల్డ్ ప్లేస్‌మెంట్లకు సహాయం చేస్తాడు. ఒక కెప్టెన్ టీమ్‌ని స్థిరంగా నడిపినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. అవును కెప్టెన్సీ ఛేంజ్‌ అవుతుండటం రాజస్థాన్‌ని కిందకు లాగింది.’ అని తెలిపాడు.

Tags

Next Story