RCB:18ఏళ్ల కలకు అడుగు దూరంలో

RCB:18ఏళ్ల కలకు అడుగు దూరంలో
X
పంజాబ్‌పై ఏకపక్ష గెలుపుతో ఫైనల్‌లోకి దూసుకెళ్లిన బెంగళూరు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తొలుత ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్‌ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56*; 27 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో చెలరేగాడు. విరాట్ కోహ్లీ (12), మయాంక్ అగర్వాల్ (19), రజత్ పటిదార్ (15*) పరుగులు చేశారు. స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరుకు శుభారంభం లభించింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్ నిలకడగా ఆడటంతో 3 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 30 పరుగులు చేసింది. తర్వాత కోహ్లీని జేమీసన్‌ వెనక్కి పంపగా.. సాల్ట్ దూకుడు కొనసాగించాడు. జేమీసన్ వేసిన ఆరో ఓవర్‌లో వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్.. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా 6,4 కొట్టి తర్వాత బంతికే స్లిప్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చిక్కాడు. అప్పటికే బెంగళూరు లక్ష్యానికి చేరువగా కాగా.. పటిదార్‌, ఫిల్‌ సాల్ట్ లాంఛనాన్ని పూర్తి చేశారు. బెంగళూరు ఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరినా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.

వికెట్లు ట‌ప‌ట‌పా..

ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ను ఆర్సీబీ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. పిచ్ పై దొరికిన మ‌ద్దతును ఉప‌యోగించుకుని చెల‌రేగి ఆడారు. ప‌వ‌ర్ ప్లే లోప‌ల ప్రియాంశ్ ఆర్య (7), ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ (18), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (2), జోష్ ఇంగ్లీస్ (4) వికెట్ల‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత కూడా వ‌రుస వికెట్లు కోల్పోతూనే ఉంది. మ‌ధ్య‌లో స్టొయినిస్ తోపాటు అజ్మ‌తుల్లా ఒమ‌ర్ జాయ్ (18) ఫ‌ర్వాలేద‌నిపించ‌డంతో పంజాబ్ కాస్త కోలుకున్న‌ట్లు క‌నిపించింది. వీరిద్దరు బౌండరీలతో చెలరేగడంతో వంద పరుగులను పంజాబ్ చేరుకోగలిగింది. అయితే ఆ తర్వాత వరుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో ముషీర్ ఖాన్ ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా తీసుకున్నా, అత‌ను డకౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ 85 బంతుల్లోనే ముగిసింది. మిగ‌తా బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.

సాల్ట్ విధ్వంసం..

చిన్న టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ (12), సాల్ట్ శుభ‌రంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 30 ప‌రుగుల‌ను 10కిపైగా ర‌న్ రేట్ తో సాధించారు. ఒక ఎండ్ లో కోహ్లీ యాంక‌ర్ ఇన్నింగ్స్ ఆడ‌గా, సాల్ట్ మాత్రం చెల‌రేగి, బౌండ‌రీల‌తో స‌త్తా చాటాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ (19) తో కూడా సాల్ట్ రెండో వికెట్ కు 54 ప‌రుగులు జోడించ‌డంతో ఆర్సీబీ విన్నింగ్ పొజిష‌న్లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత మ‌యాంక్ ఔటైనా.. కెప్టెన్ ర‌జ‌త్ ప‌తిదార్ (15 నాటౌట్) తో క‌లిసి సాల్ట్ విజ‌య తీరాల‌కు చేర్చాడు. మ‌రోవైపు ఫైన‌ల్లో చోటు కోసం క్వాలిఫ‌య‌ర్ -2లో పంజాబ్ ఆడ‌నుంది.శుక్ర‌వారం జ‌రిగే ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతున్నాయి.

ప్రభ్‌సిమ్రన్‌ అరుదైన రికార్డు

పంజాబ్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ IPL-2025లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఓ IPL సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. RCBతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో షాన్‌ మార్ష్‌(PBKS-2008) తొలి స్థానంలో ఉండగా.. సూర్యకుమార్‌(MI-2018), ఇషాన్‌ కిషన్‌ (MI-2020), జైస్వాల్‌ (RR-2023), రియాన్‌ పరాగ్‌ (RR-2024) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags

Next Story