US OPEN: బోపన్న కల నెరవేరలేదు
భారత టెన్నీస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంది. అద్భుత ఆటతీరుతో పురుషుల డబుల్స్ ఫైనల్ చేరిన బోపన్న జోడీ రన్నరప్తో సరిపెట్టుకుంది. పురుషుల టెన్నిస్ చరిత్రలో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్న కల నెరవేరలేదు. శుక్రవారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లో బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ పరాజయం చవిచూసింది. తుదిపోరులో బోపన్న- ఎబ్డెన్ జోడీ 6-2, 3-6, 4-6 తేడాతో వరుసగా రెండు సార్లు ఛాంపియన్ మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)- జో సాలిస్బరి (బ్రిటన్) చేతిలో ఓడింది. డిఫెండింగ్ చాంపియన్స్, మూడో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) ద్వయం వరుసగా మూడో ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. 1930 తర్వాత ఈ టోర్నీలో వరుసగా మూడేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. మొదటి సెట్ను కైవసం చేసుకున్న బోపన్న ద్వయం చరిత్ర సృష్టించే దిశగా సాగింది.
కానీ రాజీవ్ రామ్ (అమెరికా)- జో సాలిస్బరి (బ్రిటన్) జోడి గొప్పగా పుంజుకుంది. వరుసగా మూడు గేమ్లు గెలిచి సెట్ ముగించింది. రెండో సెట్లో పోరు హోరాహోరీగా మారింది. ఓ దశలో 2-2తో స్కోరు సమమైంది. కానీ ఆ తర్వాత ప్రత్యర్థి జోడీ ధాటి ముందు బోపన్న జంట నిలవలేకపోయింది. ఆరో గేమ్లో బోపన్న–ఎబ్డెన్ సర్విస్ను బ్రేక్ చేసి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లారు. అదే జోరులో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచారు. 2–1తో ఆధిక్యంలో ఉన్నదశలో మూడో గేమ్లో మూడుసార్లు ప్రత్యర్థి సర్విస్ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సర్విస్ను నిలబెట్టుకున్న రాజీవ్–సాలిస్బరీ ద్వయం స్కోరును 2–2తో సమం చేయడంతోపాటు ఐదో గేమ్లో బోపన్న జంట సర్విస్ను బ్రేక్ చేసి, ఆరో గేమ్లో తమ సర్విస్ను కాపాడుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు 6–4తో రాజీవ్–సాలిస్బరీ జోడీ సెట్తోపాటు మ్యాచ్ను దక్కించుకుంది.
తాజా ఫలితంతో 43 ఏళ్ల 6 నెలల వయసున్న బోపన్న తన కెరీర్లో రెండోసారి పురుషుల డబుల్స్ గ్రాండ్స్లామ్ టోర్నీలో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. 2010 యూఎస్ ఓపెన్లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో కలిసి ఆడిన బోపన్న డబుల్స్లో రన్నరప్గా నిలిచాడు. విజేత రాజీవ్–సాలిస్బరీ జోడీకి 7 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 80 లక్షలు)... రన్నరప్ బోపన్న–ఎబ్డెన్ జంటకు 3 లక్షల 50 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 90 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com