Common wealth Games : వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు 3 పతకాలు..
![Common wealth Games : వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు 3 పతకాలు.. Common wealth Games : వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు 3 పతకాలు..](https://www.tv5news.in/h-upload/2022/07/31/763891-common-wealth-games-india.webp)
Common wealth : కామెన్వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. ఒకేరోజు మూడు పథకాలు గెలుచుకున్నారు. ఇక 49 కేజీల విభాగంలో భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయ్ చాను సరికొత్త చరిత్ర సృష్టించింది. 113 కేజీల బరువు ఎత్తి.. స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మరోవైపు సంకేత్ మహదేవ్, గురురాజ్ పూజారిలు రజత, కాంస్య పతకాలతో మెరిశారు.
కామన్వెల్త్ గేమ్స్లో రెండో రోజు భారత్ పతకాల పంట పండిస్తోంది. వెయిట్ లిఫ్టింగ్లో క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. మహిళల 49 కేజీల వెయిట్లిప్టింగ్ విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలుపొందింది. ఫైనల్లో స్నాచ్లో 88 కిలోలు బరువు ఎత్తిన మీరాబాయి చాను.. అనంతరం క్లీన్ అండ్ జర్క్లో 113 కేజీలు ఎత్తింది. దాంతో మొత్తంగా 201 కేజీలతో ఆమెకి గోల్డ్ మెడల్ దక్కింది. మీరాబాయి చాను క్లీన్ అండ్ జర్క్లో మూడో అటెంప్ట్లో 115 కేజీల బరువుని ఎత్తేందుకు ప్రయత్నించింది. కానీ విఫలమైంది. అయినప్పటికీ.. ఫైనల్లో మీరాబాయి చానుని ఎవరూ అధిగమించలేకపోయారు.
కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయి చాను పతకం గెలవడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు రజత పతకం గెలుపొందిన మీరాబాయి చాను.. తొలిసారి పసిడిని ముద్దాడింది. మీరాబాయి చాను పర్సనల్ రికార్డ్..క్లీన్ అండ్ జర్క్లో 109 కేజీలు ఉండగా.. 113 కేజీలతో కొత్త రికార్డ్ సృష్టించింది
అంతకుముందు ఫురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సాగర్ రజత పతకం గెలుచుకున్నాడు. సంకేత్ సాగర్ ఫస్ట్ క్లీన్ అండ్ జర్క్ అటెంప్ట్లో 135 కేజీల బరువుని ఎత్తి పతక రేసులో నిలిచాడు. సెకండ్ అటెంప్ట్లో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డాడు. అయినప్పటికీ మూడో అటెంప్ట్ కోసం ట్రై చేశాడు. కానీ మోచేతి గాయం నొప్పిని తాళలేకపోయాడు. దాంతో రజత పతకం తో సరిపెట్టాడు.
ఇక ఫురుషుల 61 కేజీల విభాగంలో పోటీపడిన గురురాజ పూజారి స్నాచ్, క్లీన్ అండ్ జర్క్తో కలిపి మొత్తం 269 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని భారత్కి అందించాడు. 61 కేజీల వెయిట్లిప్టింగ్ పోటీల్లో మలేసియాకి చెందిన అజ్నిల్ బిడిన్ 285 కేజీలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత న్యూ జెనీవాకి చెందిన మోరియా బారు 273 కేజీల బరువు ఎత్తి సిల్వర్ మెడల్ని అందుకోగా.. గురురాజ పూజారి 269 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు.
మొత్తానికి కామన్వెల్త్ పోటీల్లో ఒకే రోజు భారత్ కు మూడు పతకాలు రావడంతో భారత అభిమానులు సంబర పడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com