Dutee Chand: మసాజ్ చేయమనేవారు.. మానసికంగా వేధించేవారు: ద్యుతీ చంద్

Dutee Chand: అదీ ఇదీ అని లేదు.. ఏ రంగమైనా పురుషుడి చర్యలకు స్త్రీలు బలవుతూనే ఉంటారు. ఆట మీద ఇష్టంతో అవమానాలెన్నింటినో భరించానని ఏస్ ఇండియన్ స్ర్పింటర్ ద్యుతీ చంద్ వివరించారు. సీనియర్ల ర్యాగింగ్ భరించలేక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఒకరోజు తర్వాత భువనేశ్వర్లోని ప్రభుత్వ స్పోర్ట్స్ హాస్టల్లో తాను కూడా వేధింపులకు గురైన విషయాన్ని బయటపెట్టింది ద్యుతి.
2006-2008 మధ్య కాలంలో భువనేశ్వర్లోని స్పోర్ట్స్ హాస్టల్లో తాను ఉన్నానని, అక్కడ సీనియర్లు తనను వేధించారని, తాను కూడా ర్యాగింగ్ గురయ్యానని ద్యుతీ వివరించింది. "స్పోర్ట్స్ హాస్టల్లో తమ శరీరాలకు మసాజ్ చేయమని, బట్టలు ఉతకమని సీనియర్లు నన్ను బలవంతం చేసేవారు. నేను వారిని వ్యతిరేకించినప్పుడు, వారు నన్ను వేధించేవారు, "అని ఏస్ అథ్లెట్ డ్యూటీ సోషల్ మీడియా పోస్ట్లో ఆరోపించారు.
కటక్ జిల్లాకు చెందిన రుచికా మొహంతి అనే హిస్టరీ (ఆనర్స్) విద్యార్థిని, తన ముగ్గురు సీనియర్లు తనను మానసికంగా వేధించారని, ఇక తట్టుకోలేకపోతున్నానని సూసైడ్ నోట్లో రాసింది. క్యాంపస్లలో జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్లు ఆరోపిస్తున్నారు. రుచిక ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ కలకలం రేగింది. జూలైలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత రిలే జట్టుకు ఎంపికైన ద్యుతి, సీనియర్ అథ్లెట్లు కూడా తన కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక స్థితి గతులపై హేళనగా వ్యాఖ్యానించేవారని వివరించింది.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సీనియర్లపై చర్యలు తీసుకోకపోగా తననే మందలించే వారని పోస్ట్ లో వాపోయింది. "ఈ సంఘటన నా మానసిక స్థితిపై ప్రభావం చూపింది. "ర్యాగింగ్ సంఘటనలు జరిగిన తర్వాత క్రీడలపై దృష్టి సారించడం చాలా కష్టంగా ఉంది. దీని నుండి బయటపడిన వారు మాత్రమే హాస్టల్లో ఉండగలుగుతారు. కానీ చాలా మంది అక్కడ జరుగుతున్న అవమానాలు భరించలేక హాస్టల్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంటారు అని ద్యుతి పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com