ఆట ముగిసింది.. విడిపోతున్నాం: ఆయేషా ముఖర్జీ

ఆట ముగిసింది.. విడిపోతున్నాం: ఆయేషా ముఖర్జీ
ఆయేషా ముఖర్జీ.. భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఎనిమిది సంవత్సరాల తమ వివాహ బంధానికి..

ఆయేషా ముఖర్జీ మంగళవారం భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఎనిమిది సంవత్సరాల తమ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. శిఖర్ ఆయేషాకు జోరవర్ అనే 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

ఆయేషా ముఖర్జీ ఎవరు? శిఖర్ ధావన్‌‌తో ఆమెకు ఎలా పరిచయం.. పెళ్లికి దారితీసిన సంగతులు.. తెలుసుకుందాం.. ఆయేషా మాజీ కిక్‌బాక్సర్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి పేరు సంపాదించుకున్న ప్రఖ్యాత క్రీడాకారిణి.

ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శిఖర్ ధావన్‌కి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా. తన జీవితంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అది రెండు సార్లు విఫలమవడం తనను ఆవేదనకు గురి చేస్తోందని తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. దీనిలో ఆమె రెండుసార్లు విడాకులు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది అనే దానిపై సుదీర్ఘ పోస్ట్ రాసింది. ఆమె తన భావోద్వేగాలను అందులో పొందుపరిచింది. "నేను 2 సార్లు విడాకులు తీసుకునే వరకు విడాకులు అనే పదాన్ని ఒక డర్టీ వర్డ్‌గా భావించేదాన్నని రాసింది.

ఆయేషా శిఖర్‌తో విడాకులకు దారి తీసిన పరిస్థితులను వివరించింది. వివాహ బంధంలో చిక్కుకుని తన జీవితాన్ని త్యాగం చేయాలనుకోలేదని రాసుకొచ్చింది. "ఓ మనిషిని జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాక అతనితో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కలిసి జీవించాలనుకుంటుంది. విడాకులు తీసుకోవాలని భాగస్వామితో విడిపోవాలని ఎవరూ కోరుకోరు.. మీ వివాహ బంధాన్ని నిలుపుకునేందుకు మీరు మీ వంతు కృషి చేసినప్పటికీ, మీ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించవు.

మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషా ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్తను శిఖర్ ధావన్ కంటే ముందు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు అలియా, రియా ఉన్నారు. ఆమె మొదటి వివాహం విఫలమవడానికి దారితీసిన కారణాలు వివరించలేదు. అయితే అతడితో విడిపోయే ముందు తాను చేస్తున్నది తప్పేమో అని తల్లిదండ్రులకు, పిల్లలకు అన్యాయం చేస్తున్నానేమో అని తీవ్రంగా మదన పడ్డానని రాసుకొచ్చింది. కానీ అతడితో కలిసి ఉండే పరిస్థితి లేక విడిపోవలసి వచ్చిందని తెలిపింది.

ధావన్‌తో ఆయేషాకు మొదటి పరిచయం ఫేస్‌బుక్ ద్వారా జరిగిందనే విషయం చాలామందికి తెలియదు. ఇద్దరి మధ్య లింక్ ధావన్ మాజీ సహచరుడు హర్భజన్ సింగ్, ఈ జంటకు కామన్ ఫ్రెండ్. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, ఆమె 2009 లో ధావన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. 2012 లో ఈ జంట వివాహం చేసుకున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో, ధావన్ ఇన్‌స్టాగ్రామ్ పేజిలో ఫన్నీ పోస్టులు పెట్టి అభిమానులను అలరించాడు. ఈ వీడియోల్లో ఆయేషా, ధావన్‌ల మధ్య కెమిస్ట్రీని చూసి ముచ్చటపడ్డారు. కానీ అంతలోనే ఇలా విడాకులు తీసుకుని అభిమానులను నిరాశపరిచారు.

Tags

Read MoreRead Less
Next Story