IPL: ముంబైను చిత్తు చేసిన "కింగ్స్‌"

IPL: ముంబైను చిత్తు చేసిన కింగ్స్‌
X
క్వాలిఫయర్‌-2లో అదరగొట్టిన పంజాబ్... ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

పంజాబ్ అద్భుతం చేసింది. టోర్నీ చ‌రిత్ర‌లో రెండోసారి ఫైన‌ల్ కు దూసుకెళ్లింది. ఆ జట్టు ఇంతకుముందు ఒకే ఒక్కసారి.. 2014లో ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో బెంగళూరును పంజాబ్‌ కింగ్స్‌ ఢీకొంటుంది. ఐపీఎల్‌లో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడనున్నాం. క్వాలిఫయర్‌ 2లో అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ముంబై ఇండియ‌న్స్ భారీ స్కోరు చేసింది. అహ్మదాబాద్‌ న‌రేంద్ర మోడీ స్టేడియంలో హిట్టర్లు సూర్య‌కుమార్ యాద‌వ్(44), తిల‌క్ వ‌ర్మ‌(44)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో(36) ధ‌నాధ‌న్ ఆట‌తో గ‌ట్టి పునాది వేయ‌గా.. ఆ త‌ర్వాత జ‌ట్టును ప‌టిష్ట స్థితిలో నిలిపారు సూర్య‌, తిల‌క్. వీళ్లు కీల‌క‌మైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పగా.. చివ‌ర్లో న‌మ‌న్ ధిర్(37) త‌న మార్క్ బ్యాటింగ్‌తో అల‌రించాడు. డెత్ ఓవ‌ర్ల‌లో ర‌న్స్‌ సాధించాడు. దాంతో, హార్దిక్ బృందం నిర్ణీత ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ఐదు సార్లు ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ క్వాలిఫ‌యర్ 2లోనూ త‌మ మార్క్ ఆట‌ను క‌న‌బ‌రిచింది. అయితే ఎక్కడా వెనక్కి తగ్గని పంజాబ్ ధీటైన ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

రోహిత్‌ తక్కువ పరుగులకే..

వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా ప్రారంభమైన పోరులో.. ముంబై ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో(36) ధాటిగా ఆడాడు. కానీ, గ‌త మ్యాచ్ హీరో రోహిత్ శ‌ర్మ‌(8) స్టోయినిస్ బౌలింగ్‌లో ఫుల్‌షాట్ కొట్టబోయి వెనుదిరిగాడు. ప‌వ‌ర్ ప్లేలో ముంబై వికెట్ న‌ష్టానికి 65 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్(44), తిల‌క్‌లు గ్రౌండ్ షాట్ల‌తో అల‌రించారు. సూర్య, తిలక్ సరిగ్గా 44 పరుగులే చేసి అవుటైనా స్కోర్ వేగం మాత్రం తగ్గలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(15) అండ‌తో కుర్రాడు న‌మ‌న్ ధిర్(47) రెచ్చిపోయాడు. ముంబై 203కు ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

అయ్యర్‌ పోరాటం

ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (6) త్వరగానే నిష్క్రమించినా ఛేదన ఆరభంలో పంజాబ్‌ విశ్వాసంతోనే సాగింది. ఇంగ్లిస్‌ (38; 21 బంతుల్లో 5×4, 2×6) చక్కని షాట్లతో అలరించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. ప్రియాంశ్‌ ఆర్య (20) కూడా బ్యాట్‌ ఝళిపించాడు. ఆర్య, ఇంగ్లిస్ అవుటైనా శ్రేయస్, నేహాల్‌ వధేరా చక్కని బ్యాటింగ్‌తో పంజాబ్‌ను రేసులో నిలిపారు. ధాటైన బ్యాటింగ్‌తో సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులో ఉంచారు. వధేరా ఔటైనా, 17వ ఓవర్లో శశాంక్‌ రనౌటైనా శ్రేయస్‌ అదిరే బ్యాటింగ్‌ను కొనసాగించడంతో పంజాబ్‌ లక్ష్యం దిశగా సాగింది. ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్‌కు 23 పరుగులు అవసరమయ్యాయి. కానీ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ను కొనసాగించిన శ్రేయస్‌.. ఆరు బంతుల్లోనే పని పూర్తి చేశాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (87 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 8×6) చెలరేగడంతో పంజాబ్ ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Tags

Next Story