IPL: నేడు డబుల్ ధమాక

IPL: నేడు డబుల్ ధమాక
X
హైదరాబాద్‌తో రాజస్థాన్‌ ఢీ... చెన్నై- ముంబై మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్

IPL-2025లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్.. ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగు జట్లకు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ కావడంతో గెలుపు సాధించాలని భావిస్తున్నాయి. న్‌రైజర్స్‌ శుభారంభం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కొత్త సారథి రియాన్‌ పరాగ్‌ సారథ్యంలో సీజన్‌ను ప్రారంభిస్తున్న రాజస్థాన్‌ మొదటి మ్యాచ్‌లోనే కఠినమైన పరీక్షకు సిద్ధమైంది. పటిష్టమైన సన్‌రైజర్స్‌ రూపంలో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కోనుంది.

ఓపెనర్లు నిలిస్తే తుఫానే

గత ఏడాది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ ఒక్క సీజన్‌లోనే మూడు సార్లు 250 పైగా స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు (287/3)తో సరికొత్త చరిత్ర సృష్టించింది. పవర్‌ ప్లేలో అత్యధిక పరుగుల (125/0) రికార్డునూ సొంతం చేసుకుంది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ, ట్రావిస్‌ హెడ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్, ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డిలతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. స్పిన్నర్ హసరంగ, పేసర్ జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు.

రాజస్థాన్‌పై SRHదే పై చేయి

సన్‌ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు జట్లు 20 సార్లు తలపడ్డాయి. అందులో హైదరాబాద్‌ 11 సార్లు, రాజస్తాన్‌ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అలాగే, ఉప్పల్ స్టేడియంలో RRపై హైదరాబాద్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో ఇక్కడ జరిగితే నాలుగింట గెలిచింది. దీంతో ఈ రోజు కూడా రాజస్థాన్‌ను చిత్తుచేసి బోణీ కొట్టడం ఖాయమంటున్నారు అభిమానులు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా సంజు శాంసన్

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే పూర్తిస్థాయి కెప్టెన్‌ సంజు శాంసన్‌కు గాయమవడం రాజస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. సంజు వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉంటాడని ఇప్పటికే మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. సంజు శాంసన్ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలో దిగొచ్చు. సంజు స్థానంలో తాత్కాలికంగా పగ్గాలు చేపట్టిన రియాన్‌ పరాగ్‌.. జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. జోస్‌ బట్లర్‌ను వదిలేసుకోవడంతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ గతి తప్పినట్లుగా కనిపిస్తుంది. భారమంతా ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌పైనే ఉంది. జోఫ్రా ఆర్చర్‌ ఆధ్వర్యంలోని సందీప్‌శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, ఫజల్‌హక్‌ ఫారూఖీ, మహీశ్‌ తీక్షణ, వనిందు హసరంగతో కూడిన బౌలింగ్‌ విభాగం ఏం చేస్తుందన్నంది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story