T20 WORLD CUP: పాకిస్థాన్ నాటకాలు మళ్లీ షురూ

టీ20 వరల్డ్కప్ 2026 టోర్నమెంట్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక దశలో టోర్నమెంట్కే దూరంగా ఉంటామంటూ సంచలన ప్రకటనలు చేసిన పాకిస్తాన్, ఆపై భారత్తో మ్యాచ్ ఆడబోమని బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా పరిణామాలతో ఆ వైఖరికి పూర్తిగా భిన్నంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్తో మ్యాచ్కు సిద్ధమవుతున్న సంకేతాలు రావడంతో, ఈ మెగా టోర్నీలో అభిమానులు ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ భారత్–పాకిస్తాన్ పోరు జరిగే అవకాశాలు మళ్లీ బలపడుతున్నాయి.
మారిన స్వరం
టీ20 వరల్డ్కప్ 2026 నిర్వహణపై మొదటి నుంచే పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. భద్రతా కారణాలు, రాజకీయ అంశాలను తెరపైకి తెచ్చిన పాకిస్తాన్—ఒక దశలో అసలు టోర్నమెంట్లో పాల్గొనబోమన్న వాదనను కూడా ముందుకు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొలంబోకు వచ్చి టోర్నమెంట్లో ఆడతామని ప్రకటించడం ద్వారా ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఇదే సమయంలో మరో సంచలన నిర్ణయం వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్లో పాల్గొంటాం గానీ, భారత్ లాంటి బలమైన జట్టుతో మాత్రం ఆడబోమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి రాజకీయ రంగు కూడా అద్దుతూ, భారత జట్టు బంగ్లాదేశ్ విషయంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంపై పాకిస్తాన్ ప్రధాని **షరీఫ్** కూడా అధికారికంగా స్పందించారు. వీడియో సందేశం ద్వారా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో, ఈ వివాదం క్రికెట్ స్థాయిని దాటి రాజకీయ స్థాయికి చేరింది.
ఐసీసీ హెచ్చరికలతో మారిన దిశ
పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ షెడ్యూల్ను అతిక్రమిస్తే భారీ జరిమానాలు, భవిష్యత్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆంక్షలు, ద్వైపాక్షిక సిరీస్లపై నిషేధం విధించే అవకాశం ఉందంటూ ఐసీసీ వరుసగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ హెచ్చరికల ప్రభావంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గినట్లు పాక్ జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. బహిష్కరణ నిర్ణయాన్ని పక్కన పెట్టి, భారత్తో మ్యాచ్ ఆడే దిశగా మళ్లీ ఐసీసీతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారత్తో వివాదానికి వెళ్లకుండా, సామరస్యపూర్వకంగా మ్యాచ్ నిర్వహణకు సహకరిస్తామని పాకిస్తాన్ బోర్డు కొత్త వాదనను ముందుకు తెచ్చిందని సమాచారం.
శ్రీలంక బోర్డు ఒత్తిడి
ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నది శ్రీలంక క్రికెట్ బోర్డు. భారత్–పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని లంక బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు, ప్రసార హక్కులు, స్పాన్సర్ డీల్స్, భద్రతా ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఈ మ్యాచ్ జరగకపోతే కోట్ల రూపాయల నష్టం తప్పదని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
