T20 WORLD CUP: బ్యాటర్గా నిలిచాడు... సారధిగా నడిపించాడు

టీ 20 ప్రపంచకప్ లో భారత్ తొలి మ్యాచ్ గెలిచిన తరువాత ప్రతి భారత క్రికెట్ అభిమానిని ఒకే ప్రశ్న వెంటాడింది. “ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ లేకపోతే పరిస్థితి ఏమయ్యేది?” అని. అది కేవలం ఊహ కాదు… వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న ప్రమాదం. కెప్టెన్ సూర్య కీలక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే, టీ20 ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్లోనే ఘోర పరాజయాన్ని చవిచూసేదన్న అభిప్రాయం ఇప్పుడు విశ్లేషకుల మధ్య బలంగా వినిపిస్తోంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో తొలి మ్యాచ్ చాలా కీలకం. అటువంటి సందర్భంలో భారత బ్యాటింగ్ లైనప్ ఒకదాని తరువాత ఒకటి కుప్పకూలుతున్న వేళ, ఇన్నింగ్స్ను కాపాడుతూ జట్టుకు పోటీతత్వ స్కోరు అందించిన వ్యక్తి ఒక్క సూర్యకుమార్ యాదవ్ మాత్రమే. ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సూర్య ఫామ్పై సందేహాలు
నిజానికి, నెల రోజుల క్రితం వరకు సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో కొనసాగడమే కాదు, కెప్టెన్గా కొనసాగడంపైనా పెద్ద ఎత్తున ప్రశ్నలు వచ్చాయి. ఏడాదిన్నర క్రితం టీమ్ఇండియా పగ్గాలు చేపట్టిన సూర్య, ఆరంభంలో రెండు మూడు మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వరుసగా 26 ఇన్నింగ్స్లపాటు అర్ధశతకం సాధించలేకపోవడం అతడిపై విమర్శలకు తావిచ్చింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టీ20 బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న సూర్య, అదే ఫార్మాట్లో తడబడటం జట్టుకు భారంగా మారుతున్నాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. “ఫామ్ లేని ఆటగాడిని కెప్టెన్గా కొనసాగించడం సరికాదా?” అన్న చర్చ సెలక్టర్ల స్థాయి వరకూ వెళ్లింది.
సారథ్యంలో తిరుగులేదు
వ్యక్తిగత ఫామ్ ఎలా ఉన్నా, సూర్య నాయకత్వంలో భారత్ వరుసగా సిరీస్లు గెలుస్తూ రావడం సెలక్టర్లకు అతడిపై నమ్మకాన్ని పెంచింది. ప్రపంచకప్ దగ్గరపడుతున్న వేళ కెప్టెన్ను మార్చడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భావనతో అతడినే కొనసాగించారు. ఆ నిర్ణయానికి న్యాయం చేస్తూ సూర్య, ప్రపంచకప్కు ముందే ఫామ్లోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో వరుసగా మూడు అద్భుతమైన అర్ధశతకాలు సాధించి, “తాను ఇంకా ముగిసిపోలేదని” స్పష్టంగా నిరూపించాడు. ఆ సిరీస్ నుంచి అతడి బ్యాటింగ్లో మళ్లీ పాత ఆత్మవిశ్వాసం కనిపించింది.
ప్రపంచకప్ తొలి మ్యాచ్లో అదే ఆత్మవిశ్వాసాన్ని సూర్య కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత జట్టు వికెట్లు కోల్పోతుండగా, మరోవైపు ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. అటువంటి సమయంలో తన వికెట్ను కాపాడుకుంటూనే పరుగులు సాధించడం అంత తేలికైన పని కాదు. కానీ సూర్య ఎంతో పరిణతితో బ్యాటింగ్ చేశాడు. అవసరమైన చోట రిస్క్ తీసుకున్నాడు, అవసరం లేని చోట పూర్తిగా ఆపేశాడు. చివరి ఓవర్లలో ఒక్క షాట్ తేడా కొట్టినా భారత స్కోరు మరింత దిగజారిపోయేది. కానీ సూర్య ఏ దశలోనూ తొందరపడలేదు. సూర్య స్కూప్ షాట్లలో ఉన్న నైపుణ్యం ప్రపంచానికి తెలిసిందే. అదే కారణంగా అమెరికా బౌలర్లు అతడికి లెగ్సైడ్ ఇవ్వకుండా, ఆఫ్సైడ్కే బంతులు వేయాలని వ్యూహం రచించారు. కానీ సూర్య అంత సులువుగా చిక్కలేదు. ఫైన్ లెగ్లో తన మార్కు షాట్లు, కచ్చితమైన స్వీప్లతో ఉర్రూతలూగించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
