T20 WORLD CUP: సూపర్ పోరులో చేతులెత్తేసిన టీమిండియా

టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గ్రూప్ దశలో బలహీన జట్లపై విజృంభించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చిన భారత జట్టు, అసలు పరీక్ష ఎదురైన కీలక మ్యాచ్లో పూర్తిగా తేలిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటుతూ భారత్ను 76 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్లో సమిష్టి వైఫల్యం, మధ్య ఓవర్లలో నియంత్రణ కోల్పోయిన బౌలింగ్, జట్టు ఎంపికపై ప్రశ్నలు—ఇవన్నీ కలసి టీమిండియా పరాభవానికి కారణమయ్యాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తమ తొలి స్పెల్లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్ లాంటి కీలక బ్యాటర్లు త్వరగా ఔటవ్వడంతో భారత్కు పైచేయి లభించినట్లే కనిపించింది.
అయితే అక్కడినుంచి మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ జోడీ ప్రతిఘటిస్తూ ఇన్నింగ్స్ను పునరుద్ధరించింది. భారత బౌలర్ల వేగాన్ని అంచనా వేసి, స్పిన్నర్లపై దాడికి దిగిన ఈ జంట స్కోరు వేగాన్ని పెంచింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టడంతో ఒత్తిడి పూర్తిగా తగ్గింది. మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించగా, బ్రెవిస్ 45 పరుగులతో మంచి మద్దతు ఇచ్చాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 44 నాటౌట్తో దూకుడు కొనసాగించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లలో 15 పరుగులకే 3 వికెట్లు, అర్ష్దీప్ 28 పరుగులకు 2 వికెట్లు తీసి మెరిశారు. అయితే మిగతా బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. వరుణ్ 4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా 45 పరుగులు, శివమ్ దూబే 32 పరుగులు సమర్పించుకోవడంతో ప్రత్యర్థి భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హార్దిక్ ఇచ్చిన 20 పరుగులు స్కోరు మరింత పెరగడానికి దోహదపడ్డాయి. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభం నుంచే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ స్లో డెలివరీకి లొంగి ఔటయ్యాడు. తిలక్ వర్మ కూడా తక్కువ స్కోరుతోనే వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ కొద్ది సేపు ఆకట్టుకున్నా 15 పరుగులకే అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కొంతసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా రన్రేట్ పెంచలేకపోయారు. కీలక సమయంలో షాట్లకు ప్రయత్నించి వికెట్లు కోల్పోవడం భారత్ను కష్టాల్లోకి నెట్టింది.
51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ మ్యాచ్ను దాదాపు అప్పగించినట్టే అయింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కలిసి కొంత ప్రతిఘటన చూపారు. 14 ఓవర్లకు 86/5గా స్కోరు ఉండటంతో కనీసం గౌరవప్రద ఓటమి దిశగా సాగుతుందనిపించింది. అయితే కేశవ్ మహరాజ్ వేసిన ఓవర్లో హార్దిక్, రింకూ సింగ్, అర్ష్దీప్ వరుసగా ఔటవడంతో భారత్కు తుదిశాక్ తగిలింది. ముగ్గురు బ్యాటర్లు బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చేయడం మ్యాచ్ను పూర్తిగా సఫారీలవైపు తిప్పింది. చివరికి 18.5 ఓవర్లలో భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. శివమ్ దూబే 42 పరుగులతో ఒక్కరే పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. భారత్ తన తదుపరి మ్యాచ్లో జింబాబ్వేను ఎదుర్కొనబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
