CWC2023: పూజలు, హోమాలు, యాగాలు

CWC2023: పూజలు, హోమాలు, యాగాలు
టీమిండియా గెలవాలని అభిమానుల పూజలు.... ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచం..

అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న టీమ్‌ ఇండియా చివరి అడుగు వేసి ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్‌తో అదరగొడుతుంటే... బౌలర్లు పదునైన బంతులతో బెదరగొడుతున్నారు. టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యులైన విరాట్ కోహ్లి, అశ్విన్‌ మరోసారి ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు. ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్‌ సేన సిద్ధంగా ఉంది. ఫైనల్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు.


చెన్నైలోని క్రికెట్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రికెట్ గణనాథుడు 11 తలల విగ్రహరూపంలో ఉండి జట్టులోని 11 మంది క్రికెటర్లను ప్రతిబింభిస్తాడని అభిమానుల విశ్వాసం. ఈ గుడిని క్రికెట్ ప్రేమికులు నిర్మించారు. ఈ దేవాలయంలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు, బౌలింగ్ వేస్తన్నట్లు వివిద భంగిమల్లో వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. క్రికెట్ అభిమానులు భారత్ జట్టు గెలవాలని ఇక్కడ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ పైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి టీమిండియా మూడోసారి కప్పు కైవసం చేసుకోవాలని కాంక్షిస్తూ.. ముంబయిలో అభిమానులు హోమం నిర్వహించారు. మధవ్ బాగ్ శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో టీమిండియా గెలవాలని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రికెట్ ప్రేమికులు టీమిండియా జర్సీలను ధరించి..త్రివర్ణ పతాకాలు చేతబూని భారత్ ఫైనల్ లో విజయం సాధించాలని నినాదాలు చేశారు.


రోహిత్ సేన విజయం సాధించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కిన్నార్ అఖారా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత క్రికెటర్ల పొస్టర్లకు విజయ తిలకం పూసి హారతి ఇచ్చారు. తమ పూజలు ఫలించి భారత్ ప్రపంచకప్ గెలిచి జగజ్జేతలుగా నిలవాలని అభిలాషించారు. పుష్కర కాలం తర్వాత టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికితోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఒడిశాకు చెందిన సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూరీ తీరంలో 56 అడుగుల ప్రపంచకప్ ట్రోఫీని తీర్చిదిద్ది టీమిండియాకు గుడ్ లక్ చెప్పారు. ఈ సైకత శిల్పం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story