TEST: మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ చిత్తు
రెండో ఇన్నింగ్స్లో పెనర్ యశస్వీ జైస్వాల్ ద్విశతకం, స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ 434పరుగుల తేడాతో జయభేరి మోగించింది. పరుగులపరంగా అత్యధిక తేడాతో టెస్టుల్లో భారత్ సాధించిన విజయం ఇదే కాగా తొలి ఇన్నింగ్స్లో శతకం సహా రెండు ఇన్నింగ్స్లలో ఏడు వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా..ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్122 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్చేసి 434పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 33 పరుగులకే... 3 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాటర్ రవీంద్ర జడేజాలు శతకాలు, సర్ఫరాజ్ ఖాన్ అర్థశతకం.., ద్రువ్ జురైల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బూమ్రాల సమయోచిత బ్యాటింగ్తో భారత్.... 445 పరుగులు చేసింది. తర్వాత మహ్మద్ సిరాజ్ 4, రవీంద్ర జడేజా, కుల్దీప్యాదవ్ రెండేసి వికెట్లు తీయగా ఇంగ్లండ్ను 319పరుగులకే ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ ఒక్కడే 153పరుగులతో రాణించగా బెన్ స్టోక్స్ 41, ఓలీ పోప్ 39పరుగులతో ఫర్వాలేదనిపించారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 214, శుభమన్ గిల్ 91 పరుగులు, సర్ఫరాజ్ఖాన్ 68పరుగులతో రాణించగా 4 వికెట్లకు 430పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్కు 557పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం చేసిన ఓపెనర్ బెన్ డకెట్ రనౌటై వెనుదిరిగాడు. కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలీ... బూమ్రా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు ఈ దశలో ఓలీ పోప్, జానీ బెయిర్స్టో, జో రూట్లను జడేజా వరుసగా పెవిలియన్ చేర్చగా ఇంగ్లండ్ 50పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత కుల్దీప్ యాదవ్ బెన్ స్టోక్స్, రెహాన్ అహ్మద్లను ఔట్ చేశాడు. అశ్విన్ టామ్ హార్ట్లీని వెనక్కి పంపాడు. ఆ తర్వాత మరోసారి చెలరేగిన జడేజా.. బెన్ ఫోక్స్, మార్క్వుడ్లను పెవిలియన్ చేర్చడంతో భారత విజయం ఖరారైంది.ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ద్విశతకంతో చెలరేగిన యశస్వీ జైస్వాల్ గేమ్ చేంజర్ అవార్డు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో శతకం, రెండు ఇన్నింగ్స్లలో ఏడు వికెట్లు తీసిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
చరిత్ర సృష్టించిన భారత్..
ఇంగ్లాండ్పై అద్భుతమైన విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ హిస్టరీలోనే 434 పరుగుల తేడాతో గెలవడం పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. అంతకుముందు 2021లో న్యూజిలాండ్పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. తాజా మ్యాచ్తో ఈ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com