OLYMPICS: చరిత్ర సృష్టించిన మనూ బాకర్‌

OLYMPICS: చరిత్ర సృష్టించిన మనూ బాకర్‌
X
124 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ బాకర్‌... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం కైవసం

ఒక్క పతకం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానులకు... రెండు పతకాలను అందించి భారత మహిళల సత్తాను అంతర్జాతీయ క్రీడా వేదికపై సగర్వంగా చాటింది స్టార్‌ షూటర్‌ మనూ బాకర్‌. ఇప్పటికే ఒక ఒలింపిక్స్‌ పతకంతో భారత పతకాల వేటను ఆరంభించిన మనూ బాకర్‌... ఇప్పుడు రెండో పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. 124 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మనూ బాకర్‌ కంచు మోత మోగించింది. ఈ కాంస్య పతక పోరులో మను బాకర్‌-సరబ్‌జోత్‌ సింగ్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియాకు చెందిన లీ-యెజిన్‌ జోడీ కేవలం 10 పాయింట్లు సాధించింది. దీంతో భారత్‌ జోడీ కాంస్య పతకాన్ని సాధించి సత్తా చాటింది. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ అనే బ్రిటిష్-ఇండియన్ రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించాడు. ప్రిచర్డ్ తర్వాత ఏ భారతీయ అథ్లెట్ కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేకపోయాడు. ఈ రికార్డును సృష్టిస్తూ... తన పేరును చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేస్తూ మనూ బాకర్‌ అద్భుతం చేసింది.


పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన స్టార్ షూటర్‌ మనూ బాకర్‌.. షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు పతకాలు సాధించిన మనూ బాకర్‌ ప్రతిభను కొనియాడుతూ పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకే ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించి మనూ భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని కొనియాడుతున్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఖాయమని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియా జోడిని మట్టి కరిపించి కాంస్య పతకాన్ని సాధించిన షూటర్లు మను భాకర్- సరబ్‌జోత్ సింగ్‌లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలాషించారు. మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌ కోసం కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మను భాకర్-సరబ్జోత్ సింగ్‌లకు అభినందనల అంటూ రాష్ట్రపతి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఒకే ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించడం చాలా గర్వంగా ఉందని రాష్ట్రపతి పోస్ట్‌లో పేర్కొన్నారు.


మను భాకర్- సరబ్‌జోత్ సింగ్‌లకు ప్రధాని మోదీ అభినందించారు. పారిస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన షూటర్లకు అభినందనలంటూ మోదీ ట్వీట్‌ చేశారు. మనూ భాకర్-సరబ్‌జోత్‌ సింగ్‌లకు తన అభినందన సందేశాన్ని అందించారు. వీరి విజయం చూసి భారత్‌ గర్విస్తోందని ప్రధాని అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తమ షూటర్లు మమ్మల్ని గర్వించేలా చేస్తూనే ఉన్నారన్నారు.

Tags

Next Story