siraj: సిరాజ్కు వరల్డ్కప్ గోల్డ్ రింగ్

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్కు.. భారత జట్టు సారధి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ విజేత ఉంగరాన్ని అందించాడు. గతేడాది జరిగిన టీ 20 ప్రపంచకప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై గెలిచి భారత జట్టు విశ్వవిజేతగా ఆవిర్భవించింది. కేవలం ఏడు పరుగుల తేడాతో గెలిచి టీమిండియా టీ 20 ప్రపంచకప్ ను ఒడిసిపట్టింది. ఈ విజయం తర్వాత టీ 20 ప్రపంచకప్ గెలిచిన ఆ జట్టులోని సభ్యులకు బీసీసీఐ ఇటీవలి వార్షిక అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఉంగరాలు బహూకరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకకు సిరాజ్ గైర్హాజరు కాగా... వాంఖడే స్టేడియంలో సిరాజ్కు రోహిత్ శర్మ ఈ బహుమతిని అందించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సిరాజ్కు ముంబై స్టార్ రోహిత్ ఈ ఉంగరాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రింగ్లో ఆటగాడి పేరు, జెర్సీ నంబర్తో పాటు జాతీయ చిహ్నం అశోక చక్రను పొందుపరిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com