Wimbledon: రెండో రౌండ్‌లో బోపన్న జోడి

Wimbledon: రెండో రౌండ్‌లో బోపన్న జోడి
పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌కు చేరుకున్న బోపన్న జంట... 6-2, 6-7, 7-6 తేడాతో తొలి రౌండ్‌లో విజయం..

వింబుల్డన్‌ పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న- ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌ జోడి రెండో రౌండ్‌కు చేరుకుంది. గ్రాండ్‌స్లామ్‌ తొలి రౌండ్‌లో బోపన్న, ఎబ్డెన్‌ జంట... 6-2, 6-7, 7-6 తేడాతో గిల్లెర్మో డ్యురాన్‌-టోమస్‌ మార్టిన్‌ జోడీపై విజయం సాధించింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను సునాయసంగా గెలుచుకున్న బోపన్న జోడీ... మిగిలిన రెండు సెట్లలో చెమటోడ్చి గెలిచింది. రెండో రౌండ్‌లో జాకబ్ ఫియర్న్లీ- జోహన్నస్ జోడితో బోపన్న జోడీ తలపడనుంది.


మిక్స్‌డ డబుల్స్‌లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి బోపనన బరిలోకి దిగనున్నాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్ గెలిచిన బోపన్న-దబ్రోవ్‌స్కీ జంట... క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్, చైనీస్ తైపీకి చెందిన లతీషా చాన్‌ జోడితో తలపడనుంది. ఈ సీజన్‌లో రోహన్‌ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్‌ జోడీ తమ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తోంది. మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీని కైవసం చేసుకుంది.

పురుషుల డబుల్స్‌లో యుకీ భాంబ్రీ-సాకేత్ మైనేని జోడీ వింబుల్డన్‌లో ఇవాళ తమ పోరాటాన్ని ప్రారంభించనున్నారు. తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అడ్రియన్ మన్నారినో, స్పెయిన్‌కు చెందిన అలెజాండ్రో డేవిడోవిచ్ ఫోకినాతో వీరు తలపడనున్నారు. ఈ ఏడాది వింబుల్డన్‌లో సింగిల్స్ విభాగంలో భారత్‌ ఆటగాళ్లు ఎవరూ లేరు. సింగిల్స్ క్వాలిఫైయింగ్‌లో పాల్గొన్న ఏకైక భారత క్రీడాకారిణి అంకిత రైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

Tags

Read MoreRead Less
Next Story