CWC2023: న్యూజిలాండ్ సెమీస్ చేరడం ఖాయమే!

ప్రపంచకప్లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లు రాణించడంతో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. అనంతరం 23.2 ఓవర్లలోనే అయిదు వికెట్లే కోల్పోయి 160 బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఈ భారీ విజయంతో విలియమ్సన్ సేన దాదాపుగా సెమీఫైనల్ చేరినట్లే. దక్షిణాఫ్రికాపై అఫ్గాన్, ఇంగ్లండ్పై పాకిస్థాన్ కనివినీ ఎరుగని భారీ విజయం సాధించి అద్భుతం సృష్టిస్తే తప్ప న్యూజిలాండ్ సెమీస్ చేరడం ఖాయమే. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లంకను కివీస్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. మూడు పరుగుల వద్దే లంక తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది.ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్ లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ఆరు పరుగులు చేసిన కుశాల్ మెండిస్ను, అదే ఓవర్ నాలుగో బంతికి ఈ మంచి ఫామ్లో ఉన్న సధీర సమరవిక్రమను కూడా బౌల్ట్ అవుట్ చేయడంతో 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక కష్టాల్లో పడిపోయింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా కుశాల్ పెరీరా ఆచితూచి ఆడాడు. 70 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక... అదే స్కోరు వద్ద మరో వికెట్ కోల్పోయింది. 5 వికెట్ల నష్టానికి శ్రీలంక70 పరుగులు చేయగా దాంట్లో 51 పరుగులు కుశాల్ పెరీరానే చేశాడు. జట్టు స్కోరు 104 పరుగుల వద్ద ఏంజెలో మాధ్యూస్ అవుట్ అయ్యాడు. 27 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన మాథ్యూస్ను శాంట్నర్ అవుట్ చేశాడు. స్కోరు బోర్డుపై మరో మూడు పరుగులు చేరాయో లేదో ధనుంజయ డిసిల్వా కూడా పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో 113 పరుగులకు లంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 150 పరుగుల్లోపు ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ చివరి వికెట్కు మహీష్ థీక్షణ ఒంటరి పోరాటం చేశాడు. 91 బంతులు ఎదుర్కొన్న థీక్షణ 39 పరుగులు చేయగా... మధుశంక 19 పరుగులు చేశాడు. వీరిద్దరూ చివరి వికెట్కు విలుపైన 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, టిమ్ సౌథీ 1, ఫెర్గ్యూసన్ 2, శాంట్నర్ 2 వికెట్లు తీశారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 23.2 ఓవర్లలో 160 బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. డేవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర తొలి వికెట్కు 12 ఓవర్లలోనే 86 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. 45 పరుగులు చేసిన కాన్వేను చమీరా, 42 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర అవుట్ అయ్యారు. 14 పరుగులు చేసిన సారధి విలియమ్సన్ కూడా వెనుదిరగడంతో 130 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 31 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేసిన డేరిల్ మిచెల్.... అసలంక పట్టిన అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. దీంతో 162 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయింది. కానీ ఫిలిప్, లాథమ్ మ్యాచ్ను పూర్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com