CWC 2023: టీమిండియా చేతిలో బంగ్లా చిత్తు

ప్రపంచకప్లో రోహిత్ సేన అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ టీమిండియా మరో సాధికార విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. తొలుత రోహిత్, గిల్.. విజయానికి గట్టి పునాదీ వేయగా... కోహ్లీ మిగిలిన పనిని పూర్తి చేశాడు. అద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు విజయాన్ని అందించాడు. సిక్స్తో ఇటు భారత జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు కోహ్లీ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్ 103 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 41 ఓవరల్లో కేవలం మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది.
బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై బంగ్లాదేశ్ను టీమిండియా బౌలర్లు 256 పరుగులకే కట్టడి చేశారు. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లా 256 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్లు తన్జీద్ హసన్, లిట్టన్ దాస్ అద్భుత ఆరంభం అందించారు. 14 ఓవర్ల వరకూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ జంట తొలి వికెట్కు 93 పరుగులు సాధించి భారీ స్కోరుకు బాటలు వేసింది. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.... ఆచితూచి ఆడుతూ సమయం చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును నడిపించింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ యాదవ్ విడగొట్టాడు. 43 బంతుల్లో 3 సిక్సులు, 5 ఫోర్లతో ధాటిగా ఆడుతున్న తన్జీద్ హసన్ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 93 పరుగుల వద్ద బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. తన్జీద్ హుస్సేన్ అవుటైనా లిట్టన్ దాస్ క్రీజులో పాతుకుపోయాడు.
ఓవైపు లిట్టన్ దాస్ నిలబడినా ఇవతలి పక్క వికెట్లు పడుతూ వచ్చాయి. 93 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయిన బంగ్లా 110 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. బంగ్లాదేశ్ 137 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ముష్పికర్ రహీమ్, మహ్మదుల్లా బంగ్లా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యంతో బంగ్లాను ముందుకు నడిపించారు. వరుసగా వికెట్లు పడుతున్నా కానీ మహ్మదుల్లా పోరాటాన్ని ఆపలేదు. ఒంటరి పోరాటం చేస్తూ బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. నౌషమ్ అహ్మద్ అండతో చివరి ఓవర్లలో మహ్మదుల్లా కీలకమైన పరుగులు సాధించాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేసిన మహ్మదుల్లాను అద్భుత యార్కర్తో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బుమ్రా బౌల్డ్ చేశాడు. రవీంద్ర జడేజా 2, కుల్దీప్ యాదవ్ మహ్మద్ సిరాజ్ 2 బుమ్రా 2 వికెట్లు వికెట్ తీశారు.
అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు వీరిద్దరూ 12 ఓవర్లలోనే 88 పరుగులు చేసి విజయానికి బాటలు వేశారు. రోహిత్ శర్మ 40 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత కింగ్ కోహ్లీ టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న విరాట్.... అద్భుత శతకంతో విశ్వరూపం చూపాడు. సిక్స్ కొట్టి భారత్ను విజయాన్నిఅందించడంతో పాటు శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com