Malaria alert: అధిక ఉష్ణోగ్రతలతో విస్తరిస్తున్న మలేరియా
![Malaria alert: అధిక ఉష్ణోగ్రతలతో విస్తరిస్తున్న మలేరియా Malaria alert: అధిక ఉష్ణోగ్రతలతో విస్తరిస్తున్న మలేరియా](https://www.tv5news.in/h-upload/2023/07/25/1026782-malaria.webp)
గ్లోబర్ వార్మింగ్ కారణంగా దోమలు తమ పరిధిని విస్తరించుకుంటూ పోతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోతూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను కొత్త ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నాయి. 2002 సంవత్సరం నుంచి 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాలు 29 శాతం తగ్గినప్పటికీ, మలేరియా బారినపడిన వారి సంఖ్య స్థిరంగానే ఉంటూ వస్తోంది. అందులోనూ మలేరియా ద్వారా 80 శాతం మరణాలు ఆఫ్రికా ఖండంలోని 5 యేళ్లలోపు చిన్నారులవే ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.
మలేరియా కారక దోమలపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. 2021 సంవత్సరంలో ఆఫ్రికాలో సుమారు 96 శాతం మలేరియా మరణాలు సంభవించడంతో శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో ఎక్కువగా దృష్టిపెట్టారు. ఒకప్పుడు ఈ కీటకాలకు ఆశ్రయం లేని ప్రాంతాల్లో నివసించే ప్రజలు కొత్తగా మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. మలేరియా-వాహక దోమల నివాసం ఒక దశాబ్దంలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారో ప్రాంతంలో వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది.
2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 24.7 కోట్ల మలేరియా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందులో మెజార్టీ వాటా రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా, ఉగాండా, మొజాంబిక్ దేశాల్లోనే నమోదయ్యాయి.
వాతావరణ మార్పులు, దోమల విస్తరణపై సంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి కరువు వస్తుందనుకునే ప్రాంతాల్లో ప్రజలు వివిధ మార్గాల్లో నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నారు. ఇది దోమల పెరుగుదలకు ఒక కారణంగా ఉంది. ఎక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలు కూడా దోమలకు ఆవాసంగా ఉంటున్నాయి. దోమలలో మలేరియా కలిగించే జాతులను కనుగొనడంలో కూడా శాస్త్రవేత్తలకు సవాలే ఎదురైంది. ఒకపుడు సులువుగానే కనుగొనే రకాలు, ఇప్పుడు జాడ చిక్కడంలేదు. దీనికి వాతావరణ మార్పులు ఒక్కటే కారణం కాకుండా, క్రిమిసంహారక మందులతో చేసిన నెట్లు కూడా కారణం కావచ్చన్నారు శాస్త్రవేత్తలు.
2000వ దశకం ప్రారంభంలో ఇథియోపియాలోని ఎత్తైన ప్రాంతాలలో ఉష్టోగ్రతల క్షీణతతో మలేరియా కేసుల సంఖ్యలో తగ్గుదల ఉన్నట్లు గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com