గుడ్ న్యూస్..ఫైజర్ కరోనా వ్యాక్సిన్కు యూకే ప్రభుత్వం అనుమతి

కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రజలకు ఫైజర్, యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పాయి. ఫైజర్ ఫార్మా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్కు యూకే ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో వచ్చే వారం నుంచి ఫైజర్-బయోఎన్ టెక్ తయారుచేసిన కొవిడ్ వ్యాక్సిన్ యూకే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ముందుగా వైద్య సిబ్బందికి, 80 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించనున్నారు.
ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి మంజూరు చేసిన తొలిదేశంగా యూకే నిలిచింది. వ్యాక్సిన్ ను యూకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఫైజర్ సంస్థ హర్షం వ్యక్తంచేసింది. తక్షణమే తాము తయారుచేసిన టీకాను యూకేకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ టీకాను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించింది.
ఫైజర్ వ్యాక్సిన్ సురక్షితమేనని .. దాన్ని వినియోగించడానికి అనుమతించాలని.. ది ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటర్.. యూకే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో ఈ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దేశంలోని ఆసుపత్రిలన్నింటిలోనూ.. వ్యాక్సిన్నిల్వకు ఏర్పాట్లు కూడా పూర్తిచేసింది.
ఫైజర్ వ్యాక్సిన్ ఫలితాలు 95 శాతం ఆశాజనకంగా ఉండడంతో యూకే దాదాపు రెండు కోట్ల టీకాలను ఆర్డర్ చేసింది. ప్రతి మనిషికి రెండు టీకాలు వేయనున్నారు. ఈ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మిగిలిన దేశాలు కూడా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చే దిశగా కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com