భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు !!

భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు !!
ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, రహదారుల మూసివేతలు

శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, రహదారుల మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్‌, సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.

శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్‌ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్‌, మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది.

ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story