ఆర్ఆర్ఆర్ సినిమా బృందంతో అమిత్షా భేటీ రద్దు

కేంద్ర హోంమంత్రి అమిత్షా హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఢిల్లీలో అత్యవసర భేటీ దృష్ట్యా ఆర్ఆర్ఆర్ సినిమా బృందంతో ఇవాళ అమిత్షా భేటీ రద్దయింది. ఆర్ఆర్ఆర్ సినిమా బృందంతో భేటీ లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. అరగంట పాటు నోవాటెల్లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లకు వెళ్లనున్నారు. 6గంటలకు హైదరాబాద్ శివారులోని చేవెళ్ల చేరుకొని.. పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. సుమారు గంటపాటు ఈ సభలో అమిత్ షా పాల్గొని.. అనంతరం అక్కడి నుంచి రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com