రెచ్చిపోయిన తల్లీకూతుర్లు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. షర్మిలను కలిసేందుకు జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చిన విజయమ్మను లోపలకు అనుమతించకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయి మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. అంతకు ముందు విధుల్లోఉన్న ఎస్ఐ,కానిస్టేబుల్పై చేయి చేసుకున్న షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్ లోటస్పాండ్ నివాసం నుంచి నిరుద్యోగ దీక్ష కోసం ధర్నా చౌక్కు బయల్దేరిన షర్మిలను.. పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించారు. దీంతో షర్మిల తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో.. పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ క్రమంలో షర్మిల.. కానిస్టేబుల్ను నెట్టేసి... ఎస్సైపై చేయి చేసుకున్నారు. షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు.. అరెస్ట్ తర్వాత తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ షర్మిల పోలీసుల్ని నిలదీశారు.
షర్మిల అరెస్ట్తో ఆమె తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. విజయమ్మను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో.. పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. మహిళా పోలీసులపై విజయమ్మ చేయి చేసుకున్నారు. ప్రశ్నిస్తున్న గొంతుపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com